జింబాబ్వే అధ్యక్షుడుగా రెండోసారి నంగాగ్వా ఎన్నిక

జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ పేట్రియాటిక్ ఫ్రంట్ (జానుపీఎఫ్) పార్టీ విజయం సాధించింది. ప్రస్తుత అధ్యక్షుడు ఎమర్సన్ నంగాగ్వా (75) విజయం సాధించారని దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.  ఎమర్సన్‌కు 50.8 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసాకు 44.3 శాతం ఓట్లు వచ్చాయి.

అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఎవరైనా నేరుగా గెలుపొందాలంటే పోలైన ఓట్లలో కనీసం 50 శాతానికి పైగా ఓట్లు సాధించుకోవాలి. అలా రాని పక్షంలో మొదటి, రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల మధ్య సెప్టెంబర్ 8న మరోసారి ఎన్నిక నిర్వహిస్తారు. అయితే 50.8 శాతం ఓట్లు సాధించిన ఎమర్సన్ స్వల్ప మెజార్టీతో రెండో దఫా ఎన్నికలను తప్పించుకోగలిగారు. 

ప్రతిపక్ష అధికార ప్రతినిధి కొన్ని నిమిషాల్లోనే ఫలితాలు ప్రకటించడం ఎలాంటి తనిఖీ లేకుండా తొందరగా చేసేశారని, తాము ఈ ఫలితాలను తిరస్కరిస్తునామని పేర్కొన్నారు. అయితే యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ ఎన్నికల పరిశీలకులు ఈ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు లేవనెత్తడంతో ఫలితాలను పరిశీలించే అవకాశం ఉంది.

కాగా, 1980లో బ్రిటన్‌ నుంచి జింబాబ్వే స్వాతంత్య్రం పొందిన తర్వాత తొలిసారి నంగాగ్వా హయాంలోనే  జానుపీఎఫ్ పార్టీ బలోపేతమైంది. అంతేగాక మంగాగ్వా తొలిసారి పూర్తికాలం పదవిలో ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. జింబాబ్వే గత రెండు దశాబ్దాలకు పైగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. నిత్యవసరాలు, అత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం పెరిగిపోయింది.