నీరజ్ చోప్రాకు అథ్లెటిక్స్ లో తొలి బంగారు పతకం

* జాతీయ రికార్డు నెలకొల్పిన పారుల్‌ చౌధరి

వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆశాకిరణ నీరజ్ చోప్రా స్వర్ణ చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్‌లో దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించాడు. పోటీలకు చివరి రోజైన ఆదివారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో గరిష్ఠంగా 88.17 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 
తొలి ప్రయత్నం ఫౌల్ అయినా ఏమాత్రం తడబడకుండా మరో భారీ త్రోతో ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. మూడో త్రోలో 86.32 మీ విసిరిన నీరజ్.. నాలుగో ప్రయత్నంలో 84.64 మీ దూరానికి పడిపోయాడు. 2022లో జరిగిన చాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించిన చోప్రా ఈసారి మెరుగైన ప్రదర్శనతో గోల్డ్ కొల్లగొట్టాడు.
 కాగా, ఫైనల్‌క అర్హత సాధించిన మరో ఇద్దరు భారత అథ్లెట్లు కిషోర్ జనా గరిష్ఠంగా 84.77 మీటర్లు విసిరి ఐదో స్థానంలో, డీపీ మను అత్యధకంగా 84.17 మీటర్లు విసిరి ఆరో స్థానంలో నిలిచారు. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో రజతం, చెక్ అథ్లెట్ జాకబ్ వాడ్లెజ్ 86.67 మీటర్లతో కాంస్యం దక్కించుకున్నారు. 2005లో లాంగ్ జంప్‌లో అంజూ బాబీ జార్డ్ కంచు పతకం సాధించింది.
మహిళల 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌ ఫైనల్‌లో భారత అథ్లెట్‌ పారుల్‌ చౌధరీ 11వ స్థానంలో నిలిచింది. 9 నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరిన పారుల్‌ జాతీయ రికార్డు నెలకొల్పి.. 2024 పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన హీట్స్‌లో ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన పారుల్‌.. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో 11వ స్థానంలో నిలిచింది. 2,900 మీటర్ల స్ప్లిట్‌ వరకు 13వ స్థానంలో ఉన్న పారుల్‌.. చివరి వంద మీటర్ల స్ప్లిట్‌లో రెండుస్థానాలను మెరుగుపరుచుకొని 11వ స్థానంలో నిలిచింది.
బెహ్రెయిన్ అథ్లెట్ విన్‌ఫ్రెడ్ ముటిలి 8.54.29 సె టైమింగ్‌తో స్వర్ణం నెగ్గగా కెన్యా రన్నర్లు బిట్రైస్ చెప్‌కోచ్, పెయిత్ చిరోటిచ్ రజత కాంస్యాలు సాధించారు. పురుషుల 5000 మీటర్ల రేసులో జాకబ్ ఇంజ్‌బ్రిక్‌స్టన్ (నార్వే) 13.11.30 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం నెగ్గగా మమ్మద్ ఖతిర్ (స్పెయిన్), జాకబ్ క్రోప్ (కెన్యా) రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.  మహిళ 800 మీటర్లలో కెన్యా రన్నర్ మేరీ మోరా 1:15.03 సెకన్ల టైమింగ్‌తో పసిడిని సొంతం చేసుకుంది. కీలీ హడ్జింగ్‌సన్ (బ్రిటన్) రజతం, అథింగ్ ము (అమెరికా) కాంస్యం దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రపంచ అథ్లెటిక్స్‌లో రాణించిన క్రీడాకారులను ప్రధాని మోదీ అభినందించారు. 400 మీటర్ల రిలే రేస్‌ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ప్రధాని.. 4×400 మీటర్ల రిలేలో అనాస్‌, అమోజ్‌, రాజేశ్‌ రమేశ్‌, మొమ్మద్‌ అజ్మల్‌ రికార్డు సృష్టించి ఫైనల్స్‌లోకి ప్రవేశించారని, ఇది గుర్తుండి పోతుందన్నారు. భారతీయ అథ్లెటిక్స్‌కు నిజంగా చారిత్మాత్మకమైన పునరాగమనం’గా పేర్కొంటూ పోస్ట్‌ పెట్టారు.