ప్రజలను సమైక్య పరిచే సత్తా సంస్కృతికి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారతదేశంలో ప్రాచీన, వైవిధ్యభరితమైన సంస్కృతి ఉందని, అది తమకు గర్వకారణమని తెలిపారు. పైకి కనిపించని సాంస్కృతిక వారసత్వ సంపదకు కూడా తాము గొప్ప విలువ ఇస్తామని చెప్పారు. వారణాసిలో జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడుతూ వారసత్వంగా వస్తున్న పూర్వ సంస్కృతికి సంబంధించిన ప్రదేశాలను పునరుద్ధరించి, కాపాడుకోవడం కోసం భారత దేశం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు.
పూర్వ సంస్కృతికి భౌతిక విలువ ఉందని, అంతేకాకుండా అది దేశ చరిత్ర, గుర్తింపు అని స్పష్టం చేశారు. తమ సాంస్కృతిక వారసత్వ సంపదకు చేరువై, ఆస్వాదించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ప్రధాని తెలిపారు. సాంస్కృతిక వారసత్వం అంటే కేవలం శిలలపై చెక్కినది మాత్రమే కాదని, తరతరాల నుంచి వస్తున్న ఆచార, సంప్రదాయాలు; పండుగలు కూడానని మోదీ పేర్కొన్నారు.
వారణాసి (కాశీ)లో ఈ సమావేశం జరుగుతున్నందుకు మోదీ హర్షం వ్యక్తం చేస్తూ కాశీ అంటే విజ్ఞానం, కర్తవ్యం, సత్యం యొక్క ఖజానా అని అందరికీ తెలుసునని చెప్పారు. ఇది భారతదేశానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పారు. వైవిద్ధ్యానికి, ఆర్థికాభివృద్ధికి పూర్వ సంస్కృతి వారసత్వం చాలా ముఖ్యమైన సంపద అని తెలిపారు.
వారసత్వంగా వస్తున్న సంస్కృతితోపాటు అభివృద్ధి సాధించాలనేది భారత దేశ మంత్రమని ప్రధాని తెలిపారు. ‘‘సంస్కృతి అందరినీ కలుపుతుంది’’ అనే కార్యక్రమాన్ని జీ20 సాంస్కృతిక మంత్రులు ప్రారంభించినట్లు తెలిపారు. ‘‘వసుధైక కుటుంబకం, ఒక భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ స్ఫూర్తితో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు.
‘‘సంస్కృతి, సృజనాత్మకత, వాణిజ్యం, సహకారం అనే నాలుగింటి ప్రాధాన్యాన్ని మీ కృషి ప్రతిఫలిస్తుంది. దయామయ, సమ్మిళిత, శాంతియుత భవిష్యత్తును నిర్మించేందుకు సంస్కృతి యొక్క శక్తిని వినియోగించుకోవడానికి అది దోహదపడుతుంది’’ అని చెప్పారు.
కాగా, మన దేశంలో దొంగతనానికి గురై, ఇతర దేశాలకు అనేక కళాకృతులు తరలిపోయాయి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి 2014 వరకు వీటిలో కేవలం 13 కళాకృతులను మాత్రమే తిరిగి తీసుకొచ్చారని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో దాదాపు 230 కళాకృతులను తిరిగి తీసుకొచ్చినట్లు తెలిపింది.
అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా సహా విదేశాల నుంచి ఈ కళాఖండాలను తీసుకొచ్చినట్లు వివరించింది. మరో 200 కళాకృతులను తీసుకురావడానికి కృషి జరుగుతోందని తెలిపింది. వీటిలో దేవుని విగ్రహాలు, ఇతర సాంస్కృతిక సంబంధిత వస్తువులు ఉన్నాయని తెలిపింది.
More Stories
పాక్ వద్ద అణుబాంబు… గౌరవించాల్సిందే… ఓ కాంగ్రెస్ నేత!
ఎన్డీయేలో చేరమని పవార్, ఠాక్రేలకు మోదీ ఆహ్వానం
అర్వింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్