ఎన్డీయేలో చేరమని పవార్​, ఠాక్రేలకు మోదీ ఆహ్వానం

బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏలో చేరాలని మహరాష్ట్రలో ప్రతిపక్షాల ఉద్దండ రాజకీయ నేతలు శరద్​ పవార్​, ఉద్ధవ్​ ఠాక్లరేకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్​లో చేరి నిర్వీర్యం అయ్యే బదులు అజిత్​ పవార్​, ఏక్​నాథ్​ షిండేలతో కలవాలని ఆయన హితవు పలికారు. జూన్​ 4 తర్వాత చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్​లో విలీనమవుతాయని జోస్యం చెప్పారు. 

నకిలీ శివసేన, నకిలీ ఎన్​సీపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​లో విలీనం కావాలని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహారాష్ట్రలో పర్యటించిన మోదీ నందర్భర్​లో నిర్వహించిన బహిరంగ సభలో ఈ మేరకు ప్రసంగించారు.

“గత 40-50 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఓ పెద్ద నాయకుడు, బారామతి లోక్​సభ స్థానంలో పోలింగ్​ తర్వాత ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. జూన్​ 4 తర్వాత చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్​లో విలీనమవుతాయి. అయితే కాంగ్రెస్​లో​ విలీనం చేసి నిర్వీర్యం అయ్యే బదులు, అజిత్​ పవార్​, ఏక్​నాథ్​ శిందేతో కలవండి.” అని ప్రధాని సూచించారు.

అయితే రానున్న రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్​తో మరింత సన్నిహితంగా మెలగుతాయని, లేదా తమ పార్టీకి మంచిదని భావిస్తే కాంగ్రెస్ లో ​ విలీనం చేసే అవకాశం ఉందని శరద్​ పవార్​ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని మోదీ ఎన్​సీపీ(శరద్​ ), శివసేన(యూబీటీ​)పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నన్ను సజీవంగా పాతేస్తారట 
కాగా, హిందూ ధర్మాన్ని కాంగ్రెస్​ అంతం చేయాలని అనుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. రామ మందిరం, రామనవమి ఉత్సవాలు భారత్​ ఆలోచనలకు విరుద్ధమని కాంగ్రెస్ రాజకుమారుడి (రాహుల్​ను ఉద్దేశిస్తూ) గురువు అమెరికాకు చెప్పారని ధ్వజమెత్తారు.
‘మొఘల్​ చక్రవర్తి ఔరంగాజేబులా, మహారాష్ట్రలో తనను కూడా సజీవంగా పాతిపెడతామని నకిలీ శివసేనకు చెందిన వారు(సంజర్​ రౌత్​ను ఉద్దేశిస్తూ) మాట్లాడుతున్నారు. వారి ఓటు బ్యాంకుకు నచ్చేలా నన్ను వారు దుర్భాషలాడారు’ అంటూ ప్రధాని ధ్వజమెత్తారు.

శివసేన (యూబీటీ)ను ‘నకిలీ శివసేన’గా ఆయన అభివర్ణించారు. ”నకిలీ శివసేన నన్ను సజీవంగా పూడ్చిపెడతామంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ‘మోదీ తేరి కబ్రా ఖుదేగి’ అంటోంది. బుజ్జగింపు రాజకీయాల కోసమే వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తు్నారు. ఇదంతా చూస్తే బాలాసాహెబ్ థాకరే ఆత్మ ఎంతగా క్షోభిస్తోందోననే బాధ కలుగుతోంది” అని మోదీ పేర్కొన్నారు.

 అయితే, ఎవరెంతగా ఆడిపోసుకున్నా శక్తిమాత అనుగ్రహం తనకు రక్షణ కవచంలా నిలుస్తోందని భరోసా వ్యక్తం చేశారు. ”సజీవంగా ఉన్నా, మరణాంతరం సైతం నన్ను ఎవరూ పాతిపెట్టలేరు” అని తేల్చి చెప్పారు.  `మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం మన రాజ్యాంగ విలువలు, సూత్రాలకు విరుద్ధం. మోదీ బతికున్నంత కాలం దళితులు, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లు ముస్లింలకు మత ప్రాతిపదికన ఇవ్వడానికి నేను అనుమతించను.’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.