అన్నదాతల సంక్షేమ విధానాన్ని ఖమ్మంలో ప్రకటిస్తాం

ఆగస్టు 27న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న ‘రైతు గోస, బీజేపీ భరోసా’ వేదిక ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల సంక్షేమానికి సంబంధించి చేపట్టబోయే అంశాలను ప్రకటింపనున్నల్టు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. రైతు బంధు మాత్రమే తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 
 
తెలంగాణ రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తున్న కేసీఆర్ సర్కారును, కౌలు రైతుల కష్టాలను అర్థం చేసుకోలేని కల్వకుంట్ల కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగానే తెలంగాణలో రైతులు  ఇబ్బందులు పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 
 
సమగ్ర పంట బీమా పథకాన్ని అమలు చేయకుండా రైతులను మరింత ఇబ్బందులకు కేసీఆర్ కుటుంబం గురిచేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతు రుణమాఫీని తెరపైకి తీసుకొచ్చి రైతులను ఆగమాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేండ్ల కింద ఇచ్చిన రుణాలకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రుణాలు రెట్టింపయ్యాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 
 
లక్షలాదిమంది కౌలు రైతుల బతుకులు చీకట్లోకి నెట్టిన ఘనమైన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందని, ధాన్యం సేకరణ మొదలుకుని, యూరియా సబ్సిడీ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థికంగా చేయూత వంటి కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
 
మహిళా రిజర్వేషన్లకు సంబంధించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట కల్వకుంట్ల కుటుంబ సభ్యులు వాస్తవాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.  మహిళాబిల్లు ప్రవేశ పెడితే ఆ బిల్లు  పేపర్లను చించేసి నానా హంగామా చేసిన నాయకుడి కుటుంబ సభ్యులను కేసీఆర్ ఇంటికి పిలిచ భోజనాలు పెట్టి చర్చలు జరిపిన విషయం తెలంగాణ ప్రజలకు ఇంకా గుర్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
 
కాగా, చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడం 140 కోట్లమంది భారతీయులకు గర్వకారణమన్న కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా సత్తాచాటడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని హర్షం ప్రకటించారు.  పుష్ప సినిమాతో అంతర్జాతీయంగా తెలుగు సినిమా హోదాను పెంచిన అల్లు అర్జున్‌ ఉత్తమ జాతీయ నటుడి అవార్డుకు ఎంపికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 

ఇప్పటికే పలు అంతర్జాతీయ సినిమా వేదికలపై ఇప్పటికే పలు అవార్డులు, రికార్డులను సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఉత్తమ ప్రజాదరణ కలిగిన చిత్రంగా ఎంపికవడం పట్ల చిత్ర దర్శకుడు రాజమౌళి, నటులు జూనియన్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ లతోపాటు చిత్ర యూనిట్ కు  శుభాకాంక్షలు తెలియజేశారు.