తాగుబోతుల తాకట్టుతో అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్‌దే

తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్‌దే అని బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఏపీ బిజెపి జరిపిన “ఓటర్ చైతన్య మహాభియాన్’’ కార్యక్రమంలో వర్చువల్లో మాట్లాడుతూ  మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా? అని ప్రశ్నించారు. 

అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ధ్వజమెత్తారు. దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇప్పుడున్న ఏపీలో మాదిరిగా దేశంలోనూ ఆనాడు బీజేపీని హేళన చేశారని గుర్తు చేస్తూ ఏమైంది?. హేళన చేసిన పార్టీలే నామరూపాల్లేకుండా పోయాయని తెలిపారు. 

ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణం అని సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయని మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకుతింటున్నారని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని చెబుతూ కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని సంజయ్ పిలుపిచ్చారు. ఈసారి వైఎస్సార్ సీసీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొందని చెప్పారు. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని ధ్వజమెత్తారు.

“ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉంది. అనంతపురం జెడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారు. మీరంతా అప్రమత్తంగా ఉండాలి” అంటూ సంజయ్ ఏపీలో బిజెపి శ్రేణులను అప్రమత్తం చేశారు. 

ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన సృష్టిస్తూ రాకుండా చేస్తున్నారని చెబుతూ భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 

కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరండీ? ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజంకాదా?. నేను నాస్తికుడని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? అంటూ సంజయ్ ప్రశ్నించారు. ఇంకా సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే తెల్వదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నడట అని మండిపడ్డారు.

మరి ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమో? అంటూ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరారని చెబుతూ  పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత అని చెప్పారు. ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంటే ఆయనను అడ్డుకోవడం దారుణం అంటూ మండిపడ్డారు.

“ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను అపే కుట్ర చేస్తున్నారు” అంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “రెండు రాష్ట్రాలు విడిపోయాయి. మనమధ్య మనస్పర్ధల్లేవ్. అందరం బాగుండాలని అనుకుంటున్నాం. ఏపీ, తెలంగాణ సీఎంలు మాత్రం దాగుడు మూతలు ఆడుకుంటున్నారు” అంటూ విమర్శించారు. 

మళ్లీ అధికారంలోకి రావడానికి మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రగిలించేందుకు కుట్ర చేస్తున్నారని హెచ్చరించారు. `నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా. మీరు హిందువులుగా ఆలోచించండి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నయ్. దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఒక మతానికే కొమ్ముకాస్తూ ఆ మతమే అధికారం చెలాయించాలని చూస్తున్నారు’ అంటూ హెచ్చరించారు. వాటిని ఇంకెంత కాలం సహిస్తారు?. జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి సంతూష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం రండి అంటూ పిలుపిచ్చారు.