మూసాపేటలో 4వేల సంవత్సరాల నాటి రేఖా చిత్రం గుర్తింపు

మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో ఆదిమానవుని ఆనవాళ్లు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ , సిఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. మూసాపేటలోని రామస్వామి గుట్టపై గల రామలింగేశ్వర ఆలయ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయడం కోసం, గ్రామస్తుల ఆహ్వానంపై జరిపిన అన్వేషణలో కొండ శిఖరంపై ఒక బండపైన కొత్త రాతియుగపు ఎద్దు బొమ్మ రేఖా చిత్రం అనుకోకుండా కనిపించిందని ఆయన చెప్పారు.

నేలమట్టం నుంచి 400 అడుగులు ఎత్తు ఉన్న రామస్వామి గుట్ట శిఖరాన గల రెండు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, ఆరు మీటర్ల మందం గల ఒక బండపై భాగంలో 10 సెంటిమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్లు ఎత్తుగల ఎద్దు బొమ్మ రేఖా చిత్రంలో ఎద్దు తల, కొమ్ములు, శరీరం, నాలుగు కాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు.

 ఈ బొమ్మ కింద కొన్ని జంతువులు, మానవుల రేఖా కూడా చిత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. పశుపాలన, వ్యవసాయం ముఖ్యవృత్తిగా గల కొత్త రాతి యుగపు మానవుడు తాను నిత్యం వాడే రాతి పనిముట్లతో ఆ ఎద్దు బొమ్మను చెక్కి ఉంటారని భావిస్తున్నారు. 

గతంలో వెలుగు చూసిన ఇలాంటి ఎద్దు బొమ్మల ఆధారంగా, మూసాపేట రేఖా చిత్రం ఇప్పటికి 4000 సంవత్సరాల నాటిదని చెబుతున్నారు. ఎండకు ఎండి, వానకు తడిచి, కొంత స్పష్టత కోల్పోయిందని చెబుతూ పురావస్తు, చారిత్రక ప్రాధాన్యత గల ఈ ఎద్దు బొమ్మ రేఖా చిత్రాన్ని కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.