మైనార్టీ విద్యాసంస్థలలో 53 శాతం వరకు నకిలీవే 

*భారీ మైనార్టీ స్కాలర్‌షిప్‌ల కుంభకోణం
 
అంతర్గత విచారణ ద్వారా దేశ చరిత్రలోనే  అత్యంత మైనార్టీ స్కాలర్‌షిప్‌ల కుంభకోణాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఛేదించింది.  మైనార్టీ సంస్థలుగా ఏర్పాటు కావడం, వీటి ద్వారా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను కాజేసి తినేయడం తంతుగా మారింది. ఇటువంటి మైనార్టీ విద్యాసంస్థలలో 53 శాతం వరకూ నకిలీవేనని వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో పుట్టుకొచ్చిన ఇటువంటి సంస్థలతో దాదాపుగా రూ 144.83 కోట్ల స్కామ్ జరిగింది. జరిగిన వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. సంబంధిత వ్యవహారంపై ఈ ఏడాది జులై 10వ తేదీన కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ తొలుత అధికారికంగా ఫిర్యాదు చేసింది. 

34 రాష్ట్రాలలో దాదాపుగా 100 జిల్లాల వరకూ ఈ గోల్‌మాల్ జరిగింది. మొత్తం 1572 సంస్థల కార్యకలాపాలపై విచారణ జరపగా వీటిలో 830 వరకూ అక్రమ కార్యకలాపాలను సాగించినట్లు వెల్లడైంది. అక్ష్యాధారాలను ధ్వంసం చేయకుండా చూసేందుకై ఆయా మైనార్టీ సంస్థల ఆస్తులను, ఖాతాలను స్తంభింపజేశారు. 

మొదటి తరగతి నుంచి ఉన్నత విద్య వరకూ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చే పథకాన్ని 2007 – 2008 విద్యాసంవత్సరంలో దేశంలోని 1.80 లక్షల విద్యాసంస్థలకు వర్తించే విధంగా ఆరంభించారు. దీని పరిధిలో మైనార్టీ విద్యార్థులకు పారితోషికాలు ఇవ్వాలి. చత్తీస్‌గఢ్‌లో మొత్తం 62 సంస్థలు నకిలీవి, స్కాలర్‌షిప్‌లు తీసుకోవడానికే వెలిసినవిగా తేలింది. 

రాజస్థాన్‌లో 128 సంస్థలను స్క్రూటిని చేయగా వీటిలో 99 వరకూ ఉనికిలోనే లేనట్లు గుర్తించారు. ఇక కేరళలోని మల్లాపురంలో ఓ బ్యాంకు ద్వారా 66,000 స్కాలర్‌షిప్‌లు పంపిణీ జరిగింది. అయితే ఇక్కడ అర్హులైన మైనార్టీ విద్యార్థులతో పోలిస్తే స్కాలర్‌షిప్‌లు మంజూరు అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 

అనంత్‌నాగ్‌లో కూడా ఇదే జరిగింది. ఇక ఓ చోట తల్లిదండ్రుల పేరిట ఉన్న ఓ సెల్‌ఫోన్ నెంబరుకు తొమ్మిదో తరగతికి చెందిన 22 మంది విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల వివరాలు అందాయి. ఈ విధంగా ఈ వ్యక్తి ఈ స్కాలర్‌షిప్‌లను పొందాడని వెల్లడైంది. ఇక మరో సంస్థకు హాస్టల్ లేకున్నా, హాస్టల్ స్కాలర్‌షిప్ పరిధిలో అందరు విద్యార్థులకు డబ్బులు అందినట్లు రికార్డులు ఉన్నాయి. అసోంలో ఓ బ్యాంకు శాఖ ద్వారా 66 వేల స్కాలర్‌షిప్‌లు అందాయి. అయితే నిర్ధారణ బృందం వెళ్లగా అక్కడి మదర్సా నుంచి బెదిరింపులు వెలువడ్డాయి. 

పంజాబ్‌లో అయితే స్కూళ్లలో విద్యార్థులు చేరకుండానే మైనార్టీ విద్యార్థుల పేరిట స్కాలర్‌షిప్‌లు అందాయి. జిల్లా నోడల్ అధికారులు పూర్తిగా క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండానే పర్యవేక్షణ సాగిస్తున్నట్లు వెల్లడైంది. మరోవంక, నకిలీ లబ్ధిదారులకు వాస్తవాలు పరిశీలించకుండానే బ్యాంకులు ఖాతాలను ప్రారంభించి, ఉపకారవేతనాలు కైవసం చేసుకునేందుకు సహకరిస్తున్న బ్యాంకుల పట్ల కూడా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.