సిమ్‌కార్డుల డీలర్లకు పోలీస్‌ వెరిఫికేషన్‌ను తప్పనిసరి

సిమ్‌కార్డులను విక్రయించే డీలర్లకు పోలీస్‌ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేస్తూ కొత్త సిమ్‌కార్డుల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు  టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఈ నిర్ణయంతో నకిలీ సిమ్‌కార్డుల అమ్మకానికి, ఒకే వ్యక్తిపై ఎక్కువ సిమ్‌ల విక్రయాలకు అడ్డుకట్టపడడంతో పాటు సిమ్‌ స్పామింగ్‌ను సైతం తగ్గిస్తుందని పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు 52లక్షల మొబైల్‌ కనెక్షన్లు మూసివేయగా, 67వేల మంది డీలర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టినట్లు కేంద్రం తెలిపింది.  ఈ ఏడాది మే నుంచి సిమ్‌కార్డు డీలర్లపై దాదాపు 300 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నకిలీ సిమ్‌కార్డుల రాకెట్‌లో పాల్గొన్న 66వేల వాట్సాప్‌ అకౌంట్లను సైతం బ్లాక్‌ అయ్యాయి. 

తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం  పోలీస్‌ వెరిఫికేషన్‌ లేకుండా సిమ్‌కార్డులను విక్రయిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 10 లక్షల మంది వరకు సిమ్‌కార్డు డీలర్లు ఉండగా, వీరంతా తప్పనిసరిగా పోలీస్‌ వెరిఫికేషన్‌ చేయించుకోవాల్సి ఉండనున్నది. అలాగే షాప్‌ కోసం కేవైసీని సైతం చేయాల్సి ఉంటుంది.

దేశంలో నిత్యం ఎక్కడో చోట సిమ్‌కార్డు మోసాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆధార్‌ నంబర్‌ను సైతం దుర్వినియోగం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఆధార్‌కార్డుపై 658 సిమ్‌కార్డులను జారీ చేయగా, సిమ్‌కార్డులన్నీ వినియోగంలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

తమిళనాడులోని సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ ఈ వారంలో ఓ వ్యక్తి ఆధార్‌ నంబర్‌పై ఉన్న 100-150 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నది. గత నాలుగు నెలల్లో తమిళనాడులోని సైబర్ క్రైమ్ వింగ్ రాష్ట్రవ్యాప్తంగా 25,135 సిమ్ కార్డులను మోసపూరిత కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లుగా అనుమానిస్తూ వాటిని బ్లాక్‌ చేసింది. 

ఇక ఏపీలోని విజయవాడలో ఒకే ఫొటోతో 658 సిమ్‌కార్డులు జారీ చేసినట్లు ఏఐ టెక్నాలజీతో విషయం వెలుగు చూసింది. ఒకే ఫొటోతో ఓ టెలికాం సంస్థకు చెందిన 658 సిమ్‌లను సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్ అనే యువకుడు పొందినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఆయా సిమ్‌లన్నింటిని బ్లాక్‌ చేయాలని బ్లాక్‌ చేయాలని టెలికాం కంపెనీని పోలీసులు ఆదేశించారు.