అవినీతికి కేంద్రంగా కేసీఆర్ ప్రభుత్వం

అవినీతికి కేంద్రంగా కేసీఆర్ ప్రభుత్వం

తెలంగాణాలో కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతికి కేంద్రంగా మారిందని,  మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదని అంటూ  మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ నుండి వచ్చిన మీడియా ప్రతినిధులతో తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాల ధోరణులపై అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టాలని చౌహాన్ సూచించారు. మధ్యప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ పోటీ చేస్తే తాము స్వాగతిస్తామని చెప్పారు. తమ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు భారత్‌ రాష్ట్ర సమితితో సంప్రదింపులు జరుపుతున్నారని శివరాజ్‌ వెల్లడించారు. 
 
అయితే, సంప్రదింపులు జరిపిన నాయకులందరూ బీజేపీ నుంచి టికెట్‌ రాదని ఆశలు వదులుకున్నవారేనని శివరాజ్‌ ఎద్దేవా చేశారు. మరోవైపు, ఏపీ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఆ రాష్ట్రంలో వాలంటీర్‌ వ్యవస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.  కార్యకర్తలకు వాలంటీర్ పోస్టులు ఇస్ వారు పార్టీ కోసమే పని చేస్తారని, ప్రజా సంక్షేమం కోసం పని చేయారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వాలు అందిస్తోన్న సామాజిక పింఛన్లు పారదర్శకంగా ఉంటేనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని శివరాజ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మధ్య ప్రదేశ్ ఇన్ ఛార్జ్ మురళీధర్‌ రావు కూడా పాల్గొన్నారు.
 
జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించారు. ఆ రాష్ట్రంలోని పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ దృష్టి సారించింది.  పలువురు నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపైనా కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ విమర్శలు ఎక్కుపెట్టారు.