ఈఎస్‌ఐ ఔషధాల కుంభకోణంలో ఈడీ దర్యాప్తు

తెలంగాణలో సంచలనం సఅష్టించిన ఈఎస్‌ఐ ఔషధాల కుంభకోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌, ఏడీతో పాటు గుత్తేదారులను ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే రూ.144 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.  దేవికారాణికి చెందిన రూ.17 కోట్లు, ఓమ్ని మెడి కంపెనీ శ్రీహరికి చెందిన రూ.119 కోట్లు, ఏడీ పద్మకు చెందిన రూ.2.4 కోట్ల ఆస్తులను గతంలోనే ఈడీ అటాచ్‌ చేసింది.
ఎసిబి ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా రెండేళ్ల క్రితం ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది.  దాదాపు రూ.200 కోట్లకు పైగా మనీలాండరింగ్‌ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు మందుల సరఫరాలో నిందితులు అవినీతికి పాల్పడ్డారు. మందులు, మెడికల్‌ కిట్లకు బహిరంగ మార్కెట్‌ కంటే ఐదారు రెట్లు ఎక్కువ చెల్లించారు. 
 
కొన్ని సంస్థలను ఎంపిక చేసుకొని వాటి ద్వారా సరఫరా చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. 2015 నుంచి 2019 వరకు రూ.వందల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అనిశా అధికారులు తేల్చారు. ఈకేసులో ఇప్పటికే అందరు నిందితులను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.