టీడీపీకి దూరంగా బిజెపితో పొత్తు వైపుగా పవన్ కళ్యాణ్!

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అంటే వైసిపి వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడటం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేయాల్సిందే అంటూ కొంతకాలంగా చెబుతూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ఎత్తుగడలతో అకస్మాత్తుగా మార్పు స్పష్టం అవుతుంది. 
టిడిపితో పొత్తు కోసం బిజెపి కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించేందుకంటూ రెండు సార్లు ఢిల్లీ వరకు వెళ్లి వచ్చిన ఆయన ఇప్పుడు ఆ విషయం గురించే మాట్లాడటం లేదు. 
గతంలో టిడిపి నేతలపై ఎక్కడ దాడులు జరిగిన ముందుగా ఖండిస్తుండే పవన్ కళ్యాణ్ ఈ నెల 4న అంగళ్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చెలరేగిన ఘర్షణల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు.  కనీసం చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినప్పుడు కూడా ఆయన స్పందించలేదు.  ఈ విషయంలో బిజెపి కూడా మౌనం వహించింది. అందుకనే జనసేన, బీజేపీ వ్యూహాత్మకంగా, ఉమ్మడిగా ఎన్నికల వైపు అడుగులు వేసే అవకాశాలు స్పష్టం అవుతున్నాయి.
 
బీజేపీతో పొత్తు పెట్టుకున్న నాలుగేళ్ల తర్వాత మొదటిసారిగా గత వారం వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ నిధులను దారిమళ్లిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ చేపట్టిన నిరసన ప్రదర్శనలలో జనసేన శ్రేణులు కూడా పాల్గొన్నారు.  అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు బీజేపీ, జనసేన శ్రేణులు ఉమ్మడిగా వైసీపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా గళం విప్పారు.
 
గత నెలలో గోదావరి జిల్లాలో చేపట్టిన `వారాహి విజయ్ యాత్ర’ సమయంలో గాని, ప్రస్తుతం విశాఖపట్టణంలో చేబడుతున్న యాత్రలో గాని ఎక్కడా టిడిపితో పొత్తు విషయం గురించి ప్రస్తావించడం లేదు.  ఈ యాత్రకు లభిస్తున్న అనూహ్య ప్రజా స్పందన చూసిన తర్వాత ఆయన ధోరణిలో కూడా మార్పు వచ్చిన్నట్లు వెల్లడి అవుతుంది. 
 
మొన్నటి వరకు వైఎస్ జగన్ ప్రభుత్వంను గద్దె దింపడం గురించే మాట్లాడిన ఆయన ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి మాట్లాడుతున్నారు.  జనసేనతో పొత్తు గురించి, ఆ పార్టీ పోటీచేసే సీట్ల గురించి పలువురు టీడీపీ నేతలు చులకనగా మాట్లాడుతూ ఉండటంతో  పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తున్నది.
 
విశాఖలోని సిరిపురంలో వివాదాస్పద సీబీసీఎన్సీ భూములను పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న జగన్ చేస్తున్న అక్రమాలు, భూ కబ్జాలు ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటామని, ప్రతి దానిపైనా కొత్త ప్రభుత్వంలో విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. రోజూ జగన్ కోర్టులు చుట్టూ తిరగడం ఖాయమని హెచ్చరించారు.
 
ప్రజలు కోరుకొంటే ముఖ్యమంత్రిని అవుతాను అంటూ మొదటిసారిగా తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అనే సంకేతం ఇస్తున్నారు. టిడిపితో పొత్తు ఉంటె అటువంటి అవకాశం ఉండదని అందరికి తెలిసిందే. టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కావాలంటే ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలు పంచుకోవాలనే ప్రతిపాదన పట్ల కూడా ఆ పార్టీ నుండి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం.
 
టిడిపితో పొత్తు గురించి సూత్రప్రాయంగా చెబుతూ వస్తున్నా ఇప్పటి వరకు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు గురించి నిర్దుష్టంగా చర్చలు జరిగిన దాఖలాలు లేవు. ఎవరెన్ని సీట్లు పోటీ చేయాలనే విషయంలో కూడా రెండు పార్టీలలో కూడా స్పష్టత లేదు. టిడిపిలో కొన్ని వర్గాలు జనసేనతో పొత్తు అనవసరం అంటూ బహిరంగంగానే వాఖ్యలు చేస్తున్నాయి.
 
రెండు పార్టీలు పోటీ చేసే సీట్ల విషయంలో ఓ అవగాహనకు రావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నట్లు ఓ వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ అటువంటి భేటీ ఏమీ జరగలేదు. పొత్తుల విషయం తేలకుండానే తెనాలి నుండి తమ అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ గుంటూరులో ప్రకటించడం కలకలం రేపింది.  పొత్తు విషయం తేలకుండా ఏకపక్షంగా యెట్లా ప్రకటిస్తారంటూ టిడిపి నేతలు కొందరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
ఇంతకు ముందు రాష్త్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్న కన్నా  లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు  జనసేనతో పొత్తును దృష్టిలో ఉంచుకొని ఉమ్మడిగా కార్యక్రమాలు జరిపే ప్రయత్నాలు చేయలేదు. పొత్తు విషయం ప్రకటించిన రోజుననే విజయవాడ నుండి అమరావతికి పాదయాత్ర జరుపబోతున్నట్లు రెండు పార్టీల నేతలు ప్రకటించి ఆ తర్వాత ఆ విషయాన్నే పట్టించుకోలేదు.
 
కానీ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే దగ్గుబాటి పురందేశ్వరి జనసేనతో కలిసి ప్రయాణం సాగిస్తామని ప్రకటించారు. ఆమె చేపట్టిన మొదటి ఆందోళన కార్యక్రమంలోనే జనసేన శ్రేణులు పాల్గొనేటట్లు చేయగలిగారు. దానితో ఎన్నికల వరకు రెండు పార్టీలు ఉమ్మడిగా నడిచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సహితం టిడిపితో సంబంధం లేకుండా అన్ని జిల్లాలో బలమైన అభ్యర్థులకు ప్రయత్నాలు చేపట్టినట్లు తెలుస్తోంది.