విదేశీ `అవినీతి’ సంపద స్వాధీనానికి సమిష్టి చర్యలు

అవినీతి, నేరపూరిత చర్యలతో సమకూరే విదేశీ సంపద స్వాధీనానికి జి20 దేశాలు చొరవ చూపాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ శనివారం జి 20 అవినీతి నిరోధక మంత్రిత్వశాఖల సమావేశాన్ని ఉద్ధేశించి ప్రసంగించారు. దోష నిర్ధారణ ప్రక్రియలతో నిమిత్తం లేకుండా ముందు నేరపూరిత చర్యల సంపాదనపరుల ఆస్తులను కట్టడి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

ఈ విషయంలో జి 20 దేశాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాల్సి ఉందని ప్రధాని చెప్పారు. అక్రమ సంపాదనలతో విదేశాలలో తిష్టవేసుకునే వారి ఆస్తులను ముందుగా గుర్తించాలి. ఇటువంటి విదేశీ ఆస్తులను సకాలంలో గుర్తించేందుకు తగు యంత్రాంగం ఏర్పాటు చేసుకోవల్సి ఉంది. ఏ విధమైన నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారనేది గుర్తించాలని సూచించారు. 

దీని వల్ల త్వరితగతిన నేరస్థులపై విచారణలు, వారి అప్పగింతలకు వీలేర్పడుతుందని ప్రధాని తెలిపారు. అవినీతి ఏ స్థాయిలో జరిగినా దీని ప్రభావం చివరికి పిడుగుపాటుగా కింది స్థాయి వారిపై అత్యంత నిరుపేదలపై పడుతోందని, అణగారిన వర్గాలకు చేటుగా మారుతుందని ప్రధాని హెచ్చరించారు.  ఈ రుగ్మతతో వనరుల సద్వినియోగానికి గండిపడుతుందని, మార్కెట్లు చతికిల పడతాయని, సేవల పంపిణీపై ప్రభావం పడుతుందని మోదీ తెలిపారు. దీనితో చివరికి ప్రజల జీవన ప్రమాణాలకు విఘాతం ఏర్పడుతుందని చెప్పారు. 

దీనిని జి 20 దేశాలు గుర్తించి తగు విధంగా ఈ వ్యవహారాలపై చెక్‌పెట్టాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ టాగూర్ నడయాడిన నగరం కోల్‌కతాకు వచ్చిన అతిధులకు స్వాగతం పలుకుతున్నామని చెప్పిన ప్రధాని ఈ సందర్భంగా విశ్వకవి గేయాలలోని నిత్యసత్యాలను తెలిపారు. ఈర్షాద్వేషాలు సత్యాన్ని ఆకళింపు చేసుకోకుండా అడ్డుతగులుతాయని కవి చెప్పిన మాటలు విశ్వజనీనం అని తెలిపారు. ఉపనిషత్తులలో కూడా ఈ విధమైన సందేశం అంతర్లీనంగా ఉందని మోదీ చెప్పారు.

అర్థశాస్త్రలో కౌటిల్యుడు చెప్పిన మాటలను విశ్లేషిస్తూ ప్రజా వనరులను సరైన విధంగా చివరికి ప్రజల సంక్షేమానికి వినియోగించడమే ప్రభుత్వ లక్ష్యం కావాలని కౌటిల్యుడు సముచితంగా ఆర్థికశాస్త్ర వివరణకు దిగారని తెలిపారు. సద్వినియోగ వనరులతోనే మరింత సముచిత సంపద వృద్ధి సాధ్యం, అక్రమ సంపాదనతో సమకూరే వనరులు అరిష్టాలనే మిగులుస్తాయని ప్రధాని చెప్పారు.

దళితులకు, గిరిజనులకు ఇప్పుడే గౌరవం

ఇలా ఉండగా, గత ప్రభుత్వాలు దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులను నిర్లక్షం చేశాయని, కేవలం ఎన్నికల సమయం లోనే గుర్తుంచుకునేవని, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలోనే వారికి గౌరవం అందుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దళిత బస్తీలు, వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ఏరియాల్లో మంచినీటి సౌకర్యం కల్పించడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయగా, ఇప్పుడు జలజీవన్ మిషన్ ద్వారా ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా పైపుల ద్వారా మంచినీరు లభిస్తోందని మోదీ వివరించారు.

మధ్యప్రదేశ్ లోని సగర్ జిల్లా ధనలో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. బడ్‌తుమా గ్రామంలో రూ. 100 కోట్లతో నిర్మాణం కానున్న సంఘసంస్కర్త, ఆధ్యాత్మిక కవి సంత్ రవిదాస్ ఆలయం, స్మారక మందిరానికి ఆయన శంకుస్థాపన చేశారు. ధనలో బినకోట రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడమేకాక, ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అనేక రోడ్ ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. సంత్ రవిదాస్ స్మారక ప్రాజెక్టులో భాగంగా 300 నదుల నుంచి వేలాది గ్రామాలకు మంచినీరు లభిస్తుందని చెప్పారు.