‘‘తెలంగాణ ఏర్పాటులో బిజెపిది కీలక పాత్ర. చీమలు పెట్టిన పుట్టలో పాములు చొర్రినట్లు మా తెలంగాణలో ఓ కుటుంబం చేరింది. అది భారత్ రాష్ట్ర సమితి కాదు.. బ్రష్టాచార్ రాష్ట్ర సమితి. 24గంటల కరెంట్ ఇస్తున్నారని చెబుతున్నారు. అది నిజమని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా” అంటూ బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సవాల్ చేశారు.
లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్లే అవిశ్వాసం పెట్టారని విమర్శించారు. రైతులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ ఎక్కడికీ వెళ్లలేదని చెబుతూ నేడు ప్రధానిని మణిపూర్ వెళ్లలేదని ప్రశ్నిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఈ తొమ్మిదేళ్లలో కెసిఆర్ కుటుంబ ఆస్తులు మాత్రమే పెరిగాయంటూ మండిపడ్డారు. గరిబ్ యోజన్ కోసం ఇచ్చిన బియ్యాన్ని సైతం అమ్ముకున్న చరిత్ర బిఆర్ఎస్ ది అంటూ ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎం,బిఆర్ఎస్ పార్టీలు ఒక గొడుగుకింద చేరి నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. అసలు కాంగ్రెస్ కు తెలంగాణాలో ఉనికే లేదని చెబుతూ ఇటీవల జరిగిన ఏ ఎన్నికలలోనూ ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు రాలేదని గుర్తు చేశారు. ఇదే సమయంలో దుబ్బాక, హుజుర్ నగర్ ఉప ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో సైతం కమలం వికసించిదని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నయ్. గల్లీలో కుస్తీ పడుతున్నట్లు యాక్షన్ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తూ మోడిగారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతన్నయ్. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కవల పిల్లలు. తెలంగాణాలో కాంగ్రెస్ పని ఖతమైందని సంజయ్ స్పష్టం చేశారు.
ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నాయకుడి వ్యవహారశైలి చూసి ప్రపంచమంతా నవ్వుతోందని తెలిపారు. ఆయన (రాహుల్ గాంధీ) ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెల్వదు. ఒకసారి కన్ను కొడతడు. ఒకసారి కౌగిలించకుంటడు. ఇంకోసారి ఫైయింగ్ కిస్ ఇస్తడు. గజినీ లెక్క తయారైండు. గిట్లాంటాయనతో కలిసి అవకాశవాద కూటమి అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అంటూ ఎద్దేవా చేశారు.
ఈ భారతమాతను హత్య చేశారంటూ కించపర్చారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత మాతవైపు కన్నెత్తి చూస్త్తే కళ్లు పీకే ఆదర్శ నేత మోదీ అని హెచ్చరించారు. వీళ్లంతా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు… యే కాంగీ… బెంగాల్ దీదీ…ఢిల్లీ క్రేజీ….బీహార్ జేడీ…. ఔర్ ఔర్… తెలంగాణ కేడీ… వీళ్లతో మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. మోదీ నాయత్వంలో ఎన్డీయే ప్రభుత్వం శక్తివంతమైన దేశంగా మారుతోందని భరోసా వ్యక్తం చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తలు నెక్కర్లు ధరిస్తే వారిని అవమానించారని రాహుల్పై మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉదయం లేవడంతో భారతమాతకు వందనం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా నమస్తే సదా వత్సలే అంటూ ఆర్ఎస్ఎస్ ప్రార్ధనను బండి సంజయ్ ఆలపించారు.
More Stories
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం
కేజ్రీవాల్ జైలులో సీఎంగా కొనసాగడంపై హైకోర్టు అసహనం