సిక్కులఊచకోతకేసులో జగదీష్ టైట్లర్ పై హత్యాభియోగాలు

1984లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత చోటు చేసుకున్న సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత,మాజీ ఎంపీ జగదీష్ టైట్లర్ పై సీబీఐ హత్యాభియోగాలు మోపింది. అప్పట్లో సిక్కుల ఊచకోతలో టైట్లర్ పాత్ర, గుంపుని సిక్కులకు వ్యతిరేకంగా ఆయన ఎలా రెచ్చగొట్టారన్న దానిపై ఓ మహిళ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా సీబీఐ ఆయనపై హత్య అభియోగాలు మోపింది.
 
కోర్టులో దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ లో ఈ ఆరోపణలు చేసింది. 1984 నవంబర్ 1న కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ ఢిల్లీలోని గురుద్వారా పుల్ బంగాష్ సమీపంలో సిక్కులను చంపడానికి ఆకతాయిలను ప్రేరేపించాడని, ఆయనపై మే 20న దాఖలు చేసిన సీబీఐ చార్జ్ షీట్ పేర్కొంది. 39 ఏళ్ల నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో టైట్లర్‌పై హత్యా నేరం అభియోగాలు మోపారు. 
 
అప్పట్లో గురుద్వారా పుల్ బంగాష్‌కు నిప్పంటించి, సిక్కు వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులను చంపడానికి టైట్లర్ జనసమూహాన్ని రెచ్చగొట్టాడని సీబీఐ ఆరోపించింది.ఆయన గుంపును ప్రేరేపించి గురుద్వారా పుల్ బంగాష్ ను తగులబెట్టడంతో పాటు, ఠాకూర్ సింగ్, బాదల్ సింగ్‌ అనే సిక్కుల్ని చంపాడని అభియోగాల్లో పేర్కొంది.

కాంగ్రెస్‌ నేత టైట్లర్ కారు దిగి గుంపును రెచ్చగొట్టడం తాను చూశానని ఓ సాక్షి చెప్పినట్లు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.ఓ గుంపు తన దుకాణాన్ని దోచుకోవడాన్ని ఆమె చూసింది, కానీ ఆమె వీలైనంత త్వరగా తిరిగి రావాలని నిర్ణయించుకుంది.  ఆమె తిరిగి వస్తుండగా, గురుద్వారా పుల్ బంగాష్‌కు దగ్గరగా ఉన్న మెయిన్ రోడ్‌లో, ఆమె తెల్లటి అంబాసిడర్ కారును చూసింది. దాని నుండి నిందితుడు జగదీష్ టైట్లర్ బయటకు వచ్చాడని సీబీఐ ఛార్జిషీట్ లో పేర్కొంది.

నిందితుడు జగదీష్ టైట్లర్ మొదట సిక్కులను చంపి దోపిడి చేయమని ఆ గుంపును ప్రేరేపించాడని, ఇది చూసిన తర్వాత ఆమె తన ఇంటికి తిరిగి వచ్చి ఆ తర్వాత తన పొరుగువారి ఇంట్లో ఆశ్రయం పొందిందని పేర్కొంది. అక్కడ ఆమె బాదేల్ సింగ్, గోర్చరణ్ సింగ్ మృతదేహాలను చూసిందని తెలిపింది.  ఆపై ఈ మృతదేహాలను టైర్లను ఉపయోగించి కాల్చారని ఆమె చెప్పింది. గురుద్వారా పుల్ బంగాష్‌కు గుంపులు నిప్పంటించడాన్ని కూడా చూశానని పేర్కొన్నట్లు సీబీఐ వెల్లడించింది. మరికొందరు సాక్ష్యులు కూడా ఇచ్చిన వాంగ్మూలను కూడా ఈ ఛార్జిషీట్ లో సీబీఐ ప్రస్తావించింది.