గత మూడు, నాలుగు వారాలుగా ఈ క్వట్క ప్రాంతం ఉద్రిక్తంగా ఉంది. గిరిజన, గిరిజనేతరుల మధ్య ఇక్కడ పలుమార్లు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. దాంతో, ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా పోలీసులు, పారా మిలటరీ దళాలను మోహరించింది. తాజా ఘటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత మరింత తీవ్రమైంది.
ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశామని బీజేపీ ఎమ్మెల్యే ఆర్ కే ఇమావ్ తెలిపారు. పారా మిలటరీ దళాలు, పోలీసులు విధుల్లో ఉండగానే, వేరే జిల్లా నుంచి సాయుధులు గ్రామంలోకి చొరబడగలగడం సాయుధ దళాల వైఫల్యమేనని, వారిపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరామని పేర్కొన్నారు. ఆ పారా మిలటరీ దళాలు, పోలీసుల్లో కొందరు ఆ దుండగులకు సహకరించారని ఆరోపించారు.
మరణించిన ముగ్గురు వ్యక్తులు సహాయ శిబిరాలలో ఉండేవారని, పరిస్థితి మెరుగుపడడంతో శుక్రవారం మధ్యాహ్నమే వారు తమ స్వగ్రామం క్వాక్తా తిరిగివచ్చారని పోలీసులు వివరించారు. ఈ సంఘటన దరిమిలా క్వాక్తాలో గుమికూడిన గ్రామస్తులు చురచంద్పూర్ వెళ్లేందుకు బయల్దేరారని, వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పోలీసులు చెప్పారు.
ఇలా ఉండగా క్వాక్తా సమీపంలో శనివారం ఉదయం భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల పోరులో ఒక పోలీసుతోసహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఇంఫాల్లోని మెడిసిటీకి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా..తాజా ఘర్షణలను పురస్కరించుకుని కర్ఫూ సడలింపు వేళలను జిల్లా యంత్రాంగం కుదించింది. రెండు ఇంఫాల్ జిల్లాలలో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు కర్ఫూ సడలించగా ఇప్పడు దాన్ని ఉదయం 5 నుంచి ఉదయం 10.30 వరకు కుదించినట్లు అధికారులు చెప్పారు.
More Stories
హైదరాబాద్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీవర్షం
సికింద్రాబాద్లో పలు విభాగాల్లో అగ్నివీర్ ఎంపికలు
టీ20 ప్రపంచకప్కు ఉగ్రముప్పు!