టీఎంసీ ఎంపీపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపూర్ హింసపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ తదితర పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘర్షణలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

శుక్రవారం కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య వాడివేడి సంభాషణ జరిగింది. చివరికి సభ అర్థాంతరంగా వాయిదా పడింది. రాజ్యసభలో అన్ని కార్యకలాపాలను వాయిదా వేసి, తాము లేవనెత్తిన అంశంపై చర్చించాలని కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, ఎస్పీ, ఆప్, ఎన్‌సీపీ, డీఎంకే పార్టీలకు చెందిన 47 మంది ఎంపీలు శుక్రవారం ఉదయం రూల్ 267 ప్రకారం నోటీసులు ఇచ్చారు. 

అయితే సభ ప్రారంభమైన వెంటనే ఇద్దరు సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. పదవీ విరమణ చేస్తున్న బీజేపీ ఎంపీ వినయ్ దినుర్ టెండూల్కర్‌కు వీడ్కోలు పలికింది. అనంతరం రూల్ 267 ప్రకారం నోటీసులిచ్చిన ఎంపీల పేర్లను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ చదివారు. సభ్యులు లేవనెత్తిన అంశంపై చర్చించేందుకు అంగీకారం తెలిపానని గుర్తు చేశారు. 

పార్టీలకు అతీతంగా స్వల్ప కాలిక చర్చలో పాల్గొనాలని కోరారు. ప్రజలకు స్ఫూర్తిదాయకంగా సభ్యులు ప్రవర్తించాలని కోరారు. ప్రతిరోజూ ఒకే విధమైన పరిస్థితి కొనసాగడం వల్ల సభ్యులకు దక్కవలసిన గౌరవం లభించదని హితవు చెప్పారు. తాను అనేక విధాలుగా సమాచారాన్ని సేకరించానని, ఈ సమాచారం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు.

వరుసగా ప్రతి సమావేశాల్లోనూ, ప్రతి రోజూ రూల్ 267 ప్రకారం అనేక నోటీసులు వస్తున్నాయన్నాయని పేర్కొంటూ గడచిన 23 ఏళ్లలో ఇలాంటి ఎన్ని నోటీసులకు అనుమతి లభించిందో ఈ సభకు తెలుసునని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయం చాలా ముఖ్యమైనదని, ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతారని గుర్తు చేశారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు ప్రశ్నోత్తరాల సమయం హృదయం వంటిదని తెలిపారు.

దీంతో డెరెక్ ఒబ్రెయిన్ స్పందిస్తూ, ‘‘ఇదంతా మాకు తెలుసు’’ అన్నారు. ఈ సమావేశాలు ప్రాంభమైనప్పటి నుంచి మణిపూర్ సమస్య గురించి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయని, దానిని చేపట్టాలని డిమాండ్ చేశారు. జగదీప్ ధన్‌కర్ స్పందిస్తూ, ‘‘దీని గురించి మీకు తెలుసునని నాకు తెలుసు. మీరు చెప్పనక్కర్లేదు. కేవలం వినండి చాలు. మీరు వింటే, మీకు అర్థమవుతుంది’’ అని పేర్కొన్నారు. 

కానీ ఒబ్రెయిన్ వెనుకంజ వేయలేదు. అప్పుడు ఆయనను తన స్థానంలో కూర్చోవాలని ధన్‌కర్ కోరారు. ‘‘మిస్టర్ డెరెక్ ఒబ్రెయిన్, నాటకీయ ప్రదర్శనలు చేయడం మీకు అలవాటుగా మారింది. ప్రతిసారీ మీరు లేచి నిలబడతారు, అది మీ విశేష అధికారంగా భావిస్తారు. సభాపతి స్థానాన్ని గౌరవించడం మీ కనీస కర్తవ్యం. నేను ఏం చెప్పినా, మీరు లేచి, నాటక ప్రదర్శనలు చేస్తారు’’ అని మండిపడ్డారు.

జగదీప్ ధన్‌కర్ వ్యాఖ్యలపై స్పందించిన ఒబ్రెయిన్ మాట్లాడుతూ, ఆయన ముందు ఉన్న బల్లపై గట్టిగా కొడుతూ, తాను నిబంధనలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నానని చెప్పారు. దీంతో ధన్‌కర్ స్పందిస్తూ, ‘‘బల్ల మీద కొట్టకండి. దాన్ని కొట్టకండి. ఇది రంగస్థలం కాదు’’ అన్నారు. ‘‘మేం దీనిని సహించం, ఐయామ్ సారీ’’ అని హెచ్చరించారు.  ఒబ్రెయిన్ ఏదో చెప్పబోతుండగా, ధన్‌కర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ‘‘దీనిని మేం భరించలేం’’ అని అంటూ సభ నుంచి వెళ్లిపోయారు.

ఇలా ఉండగా, రూల్ 267 నిబంధన కింద ఎందుకు చర్చను ప్రభుత్వం ఎందుకు కాదంటోందో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ వివరణ ఇచ్చారు. ”మణిపూర్ అంశంపై సరైన పద్ధతిలో చర్చ జరపాలని మరోసారి విపక్షాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారం. పార్లమెంటులో చర్చకు మేము అంగీకరించాం” అని తెలిపారు. 

అయితే విపక్షాలు మాత్రం రూల్ 267 రూల్ కిందనే చర్చ జరపాలని ఆ తర్వాత పట్టుబట్టాయని అంటూ మరొక మార్గం లేనప్పుడు మాత్రమే ఈ రూల్ వర్తింపజేయాలని ఆయన స్పష్టం చేశారు. కానీ, ఈరోజుతో ఏడు రోజుల సభాసమయం గడిచిపోయింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే రూల్ 267 అమలు చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు.