వచ్చే ఐదేళ్లలో ఏఎండీ రూ. 3,200 కోట్లు పెట్టుబడి

భారత్‌లో వచ్చే ఐదు సంవత్సరాల్లో 3,200 కోట్లు (400 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్‌ ( ఏఎండీ) ప్రకటించింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో జరుగుతున్న సెమీకాన్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. 
 
బెంగళూర్‌లో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 2028 నాటికి మూడు వేల మంది ఇంజినీర్లకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మార్క్‌ పేపర్‌మాస్టర్‌ తెలిపారు. ప్రపంచంలో కంపెనీకిదే అతిపెద్ద ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ కానుందన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ కేంద్రం ప్రారంభమవుతుందని చెప్పారు.
 
భారత సెమీకండక్టర్ల రంగంలో ఏఎండీ చాలా కాలంగా క్రియాశీలకంగా ఉంది. తన తొలి కేంద్రాన్ని 2001లో ఢిల్లీలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్‌, బెంగళూరు, గురుగ్రామ్‌, ముంబై సహా దేశంలోని 10 నగరాల్లో కార్యాలయాలను నిర్వహిస్తోంది. కేంద్ర ఎలక్ట్రా‌నిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఏఎండీ నిర్ణయాన్ని స్వాగతించారు. ఎలక్ట్రా‌నిక్స్‌, చిప్‌ తయారీలో భారత్‌ను అంతర్జాతీయ హబ్‌గా అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ఎందుకంటే, కార్లు, ఫోన్లు, కంప్యూటర్లతో పాటు ప్రతి ఎలక్ట్రా‌నిక్ పరికరాల తయారీకి చిప్‌లు కీలకంగా మారాయి. ప్రస్తుతం ప్రపంచానికి అవసరమైన చిప్‌లో మెజారిటీ భాగం చైనా, తైవాన్‌ నుంచే సరఫరా అవుతున్నాయి. ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు చిప్‌లు, డిస్‌ప్లే తయారీదారుల కోసం భారత ప్రభుత్వం 1000 కోట్ల డాలర్ల (రూ.82,000 కోట్ల పైమాటే) ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2026 నాటికి భారత చిప్‌ మార్కెట్‌ సైజు 6,400 కోట్ల డాలర్ల (సుమారు రూ.5.25 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవచ్చని మార్కెట్‌ పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది.
 
కాగా, గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్న చిప్‌ తయారీ ప్లాంట్‌ నుంచి రెండున్నరేళ్లలో ఉత్పత్తి ప్రారంభం కానుందని వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ వెల్లడించారు. రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో గుజరాత్‌లో సెమీకండక్టర్లు, డిస్‌ప్లేల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు వేదాంత-ఫాక్స్‌కాన్‌ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ, ఈ భాగస్వామ్యం నుంచి ఫాక్స్‌కాన్‌ ఈమధ్యనే వైదొలిగింది. దాంతో వేదాంత మరో భాగస్వామిని అన్వేషించే పనిలో ఉంది. ప్రపంచ స్థాయి టెక్‌ కంపెనీతో కలిసి ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని సెమీకాన్‌ సదస్సులో అగర్వాల్‌ తెలిపారు.
 
మరోవంక, భారత్‌లో తొలి చిప్‌ తయారీ ప్లాంట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని అమెరికన్‌ సెమీకండక్టర్‌ కంపెనీ మైక్రాన్‌ టెక్నాలజీ తెలిపింది. తమ ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా మరికొన్ని సంవత్సరాల్లో 5,000 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనతో పాటు మరో 15,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని మైక్రాన్‌ టెక్నాలజీస్‌ సీఈఓ, భారతీయ సంతతి వ్యక్తి సంజయ్‌ మెహ్రోత్రా తెలిపారు.
 
 4,000 కోట్ల డాలర్ల (రూ.3.20 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో భారత్‌లో చిప్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గత ఏడాది ద్వితీయార్ధంలో మైక్రాన్‌ ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చిప్స్‌ అండ్‌ సైన్స్‌ చట్టం ద్వారా లభించే గ్రాంట్స్‌, క్రెడిట్స్‌ మద్దతుతో 2030 వరకు ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మైక్రాన్‌ టెక్నాలజీస్‌ ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరులో డెవల్‌పమెంట్‌ సెంటర్లను నిర్వహిస్తోంది.