తెలంగాణాలో పది లక్షల ఎకరాల్లో పంట నష్టం

కనీ వినీ ఎరుగని రీతిలో కురిసిన కుండపోత వర్షాలకు తెలంగాణాలో వ్యవసాయరంగం చివికి పోయింది. వివిధ జిల్లాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే  10 లక్షల ఎకరాలకుపైగానే పంష్టనష్టం వాటిల్లింది. ఇంకా వాగులు వంకలు , నదుల పరివాహకంగా లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్ల లేతపైర్లు నిలువ నీటిలో కుళ్లిపోతున్నాయి. 

పలు ప్రాంతాల్లో పైర్లను బురద కమ్మెసింది. పొలమంతా బురద ముసుగు వేసినట్టుగా పైర్లు తలవాల్చేశాయి. వాగులు వంకలకు సమీపాన ఉన్న పొలాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. మరో వైపు వరద నీటి ఉధృతికి నిజామాబాద్ , పెద్దపల్లి, అదిలాబాద్, ములుగు ,ఖమ్మం , భద్రాద్రికొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో పైర్లు వేర్లతో సహా కొట్టుకుపోయాయి. 

చాలా చోట్ల నేల కోతకు గురైన ప్రాంతాల్లో రాళ్లు తేలాయి.ఇసుక మేటలు వేసింది. ఇక ఆ పొలం పంటల సాగుకు ఇప్పటికిప్పుడు ఎంత మాత్రం పనిచి వచ్చే పరిస్థితి లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పొలంలో నేల పైపొర రెండు అంగులాకు పైగా కొసుకుపోయింది. సారవంతమైన మట్టి అంతా కొట్టుకుపోవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 50వేల ఎకరాలకు పైగా పొలాల్లో నేల కొతకు గురైనట్టు తెలుస్తోంది. అదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్ , మంచిర్యాల , తదితర జిల్లాల్లో పత్తి పైరు భారీగా దెబ్బతింది. అప్పటికే విత్తనం వేసి ఎదుగుతున్న లేతపైర్లకు రైతులు రసాయనిక ఎరువులు కూడా వేశారు. నెలరోజులు పైగా ఉన్న లేత పత్తి పైర్లు భారీ వర్షాలు, వరదల ధాటికి భారీగా దెబ్బతిన్నాయి.

రాష్ట్రంలో ఈ సీజన్ కింద మేనెల చివరి వారం నుంచి ఇప్పటికే 40.73 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం వేశారు. ఇంకా మరో 10లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి విత్తనాలు వేయాల్సివుంది. గత వారం రోజులుగా వర్షాలు లేకుండా ఉంటే ఈ పాటికి రాష్ట్రంలో పత్తి విత్తనాలు వేయటం పూర్తయి పత్తి సాగు 50.59లక్షల ఎకరాల సాధారన సాగు విస్తీర్ణతకు చేరుకుని వుండేది. 

వ్యవసాయశాఖ అధికారుల ప్రాధామిక సమాచారం మేరకు రాష్ట్రంలో అధిక వర్షాలు వరదల వల్ల 4లక్షల ఎకరాల్లో పత్తి పైర్లు దెబ్బతిన్నట్టు వెల్లడించారు. అయితే ఈ నష్టం ఇంతకు రెట్టింపే ఉంటుందని తెలుస్తోంది. మరోవంక, రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాల వల్ల పప్పుధాన్య పంటలు పలు ప్రాంతాల్లో పాచిపోయాయి. కంది, పెసర, మినుము, తదితర పప్పుధాన్య పంటలు ఈ సీజన్‌లో 4.39లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. 

ఇంకా విత్తనాలు వేసుకునేందుకు గడువు ఉండటంలో రైతులు తెరిపి ఇస్తే పొలాల్లొ విత్తనం వేసుకునేందుకు సిద్దంగా ఉన్నారు. వ్యవసాయ శాఖ అంచానాల మేరకే సుమారు 22వేల ఎకరాల్లో కంది పంటకు నష్టం వాటిల్లింది. కందితోపాటు పెసర, మినుము పైర్లు సుమారు 50వేల ఎకరాల్లో దెబ్బతిన్నట్టు సమాచారం. 

భారీ వర్షాలు నూనెగింజ పైర్లను కూడా దెబ్బతీశాయి. వేరుశనగ వేరుకుళ్లుతో దెబ్బతింది. పైర్లలో బురదనీరు ఆకులకు పట్టేసింది. ఇప్పటికే 10వేల ఎకరాల్లో వేరుశనగ పైర్లకు నష్టం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో 5.19లక్షల ఎకరాల్లో నూనెగింజ పైర్లు సాగులోకి రావాల్సివుండగా, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ, సోయాబీన్ తదితర పైర్లు 4.19లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. 

వీటితోపాటు సుమారు 12వేల ఎకరాల్లో కూరగాయలు ఆకు కూరల పైర్లు కూడా దెబ్బతిన్నాయి. అప్పుడప్పుడే నాట్లు వేసిన వరి పైర్లు కుచ్చులతో సహా వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ నెల రెండవ వారం వరకూ వరి నాట్లు వేసిన పైర్లు కొంత నిలదొక్కుకోగలిగాయి. లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసిన వరిపైర్లు దెబ్బతిన్నాయి. 

రాష్ట్రంలో ఇప్పటికే 15.63లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో 49.86లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సివుంది. ఇప్పటివరకూ 31.36శాతం మేరకు వరినాట్లు పడ్డాయి. చాలచోట్ల అధిక వర్షాలకు వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. పది రోజుల ముందుగా వరినాట్లు పడ్డ పైర్లు వరదనీటిల మునిగి బురదకోట్టుకున్నాయి. 

అయినప్పటికీ ఈ పైర్లు తిరిగి కోలుకుంటాయని అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు ధైర్యం చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ కింద ఇప్పటివరకూ అన్ని రకాల పంటలు కలిపి 68.80లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. సాధారణ సాగు విస్తీర్ణంలో ఇది 55.36శాతానికి చేరుకుంది. వర్షంతెరిపి ఇవ్వగానే వ్యవసాయ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి గ్రామాలకు పంపి పంట నష్టం అంచానాలు వేసేందుకు సిద్దమవుతున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.