ఆంధ్రప్రదేశ్ రుణాల గురించి మాట్లాడుతూ 2023 జులై నాటికి ఆంధ్రప్రదేశ్ రుణభారం మొత్తం రూ. 10,77,006 కోట్లు ఉందని పురందేశ్వరి తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని చెప్పారు. కార్పొరేషన్ల పేరుతో చేసిన రుణాలు అధికారికమా, అనధికారికమా అన్నది ఏపీ ప్రజలకు తెలియాలని ఆమె స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు కాంట్రాక్టర్లకు రూ. 71 వేల కోట్ల బిల్లులు చెల్లించకుండా పెండింగులో ఉంచిందని చెబుతూ అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే డబ్బు లేని స్థితిలో రాష్ట్ర ఖజానా ఉందని మాజీ కేంద్ర మంత్రి విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో పంచాయితీలకు కేటాయించిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని చెబుతూ అధికార పార్టీతో పాటు అన్ని పార్టీల సర్పంచులు ఈ అంశంపై ఆందోళన చేస్తున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు.
చివరకు ప్రభుత్వ ఉద్యోగుల కోసం చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్), ఈఎస్ఐ నిధులను కూడా దారిమళ్లించి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని ఆమె ఆరోపించారు. నిధులన్నీ దారి మళ్లించి ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపుతోందని మండిపడ్డారు.
ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రుణాలు తీసుకుంటుందని, కాకపోతే అవి ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి లోబడి ఉంటాయని పురందేశ్వరి చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా ఎఫ్.ఆర్.బీ.ఎం కళ్లుగప్పి కార్పొరేషన్ల పేరుతో రుణాలు చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. మరోవైపు నాసిరకం మద్యంతో రాష్ట్ర ప్రజల జేబులు, ఆరోగ్యాలు గుల్ల చేస్తూ సంక్షేమం అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆమె విమర్సించారు. ఇదంతా తొడపాశం పెట్టి బుగ్గలు నిమిరినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
More Stories
7, 8 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీలో పర్యటన
జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రత్యేక కోర్టు కోరిన సీబీఐ
పోలవరం పునరావాసంకు `ప్రత్యేక సెస్’