దేశంలో 20 కోట్లకు చేరుకున్న ముస్లిం జనాభా

2023 నాటికి భారతదేశంలో ముస్లిం జనాభా 19.7 కోట్లకు (దాదాపు 20 కోట్లు) చేరుతుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లిం సమాజం మొత్తం జనాభాలో 14.2 శాతంగా ఉందని చెప్పారు. 

 లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) డేటా ప్రకారం ఏడు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న ముస్లింలలో అక్షరాస్యత రేటు 77.7 శాతం కాగా, శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 35.1 శాతంగా ఉందని ఆమె వివరించారు.

లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నలకు స్మృతి ఇరానీ సమాధానమిస్తూ, 2023లో దేశ జనాభా అంచనా 138.8 కోట్లుగా అంచనా వేశారని, ప్రభుత్వం అదే నిష్పత్రిలో 14.2 తీసుకుని పరిశీలిస్తే ముస్లిం జనాభా 19.7 కోట్లకు చేరుకుందని తెలిపారు. 

ఇక.. ముస్లిం సమాజానికి సంబంధించిన వివిధ సామాజిక-ఆర్థిక సూచికల గురించి మంత్రి తెలియజేస్తూ  2021-22లో స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన  పీఎల్ఎఫ్ఎస్ ప్రకారం, 94.9 శాతం మంది ముస్లింలు మెరుగైన తాగునీటి వనరులను కలిగి ఉన్నారని తెలిపారు.

 97.2 శాతం మంది మెరుగైన టాయిలెట్ సౌకర్యాలను పొందారని కేంద్ర మంత్రి వివరించారు. అంతేకాకుండా, 50.2 శాతం ముస్లిం కుటుంబాలు మార్చి 31, 2014 తర్వాత మొదటిసారిగా కొత్త ఇళ్లు లేదా ఫ్లాట్లను కొనుగోలు చేయడమో, నిర్మించుకోవడం జరిగిందని స్మృతి ఇరానీ చెప్పారు. సెషన్‌లో మాలా రాయ్ పస్మాండ ముస్లింల సామాజిక-ఆర్థిక స్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.