బెంగుళూరుకు బాబాయ్, ఢిల్లీకి అబ్బాయి!

మహారాష్ట్రలో కీలక రాజకీయ పక్షం ఎన్సీపీలో ఏర్పడిన చీలికలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రతిపక్షాలు ఏర్పాటు చేయనున్న కూటమిలో కీలక భాగస్వామిగా భావిస్తున్న ఎన్సీపీలో అత్యధికులు అధినేత శరద్ పవార్ పై తిరుగుబాటు చేయడంతో దాని ప్రభావం జాతీయ రాజకీయ సమీకరణాలపై కూడా పడనుంది. 

మంగళవారం ఒకవైపు ప్రతిపక్షాలు బెంగుళూరులో, అధికార కూటమి ఎన్డీయే ఢిల్లీలో సమావేశాలు జరుపుతుండగా బాబాయి శరద్ పవర్ బెంగుళూరు వైపు వెడుతున్నారు. కానీ అబ్బాయి  అజిత్ పవార్ మాత్రం ఢిల్లీకి వెడుతున్నారు. 

వరుసగా రెండు రోజులపాటు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి అజిత్ పవార్ బాబాయ్ ఇంటికి వెళ్లి ఎన్సీపీని ఐక్యంగా ఉంచేందుకు సహకరించమని అభ్యర్ధించారు. పరోక్షంగా ప్రతిపక్ష కూటమికి దూరంగా ఉంటూ, ఎన్డీయేతో చేతులు కలపమని సూచించారు. తనతో పాటు మంత్రులుగా చేరిన వారిని సహితం తీసుకెళ్లారు. 

అయితే, శరద్ పవార్ మౌనంగా వారి మాటలు వినడం తప్పా ఎటువంటి స్పందన లేదని ప్రఫుల్ పటేల్ తెలిపారు. శరద్ పవార్‌ను కాదని మహారాష్ట్రలో బిజెపి, షిండే వర్గపు శివసేన ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ సోమవారం తమ పూర్వపు నేత శరద్ పవార్‌ను తన బృందంతో ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. 

ఆదివారం కూడా అజిత్ తన అనుచర గణంతో పవార్ నివాసానికి వెళ్లి వచ్చారు. తాము ఆయన ఆశీస్సులు తీసుకున్నట్లు, ఆయన ఏమీ చెప్పనట్లు వివరించారు. పవార్‌తో దూరం అయిన తరువాత అజిత్ వర్గం ఆయన వద్దకు వెళ్లడం రెండు రోజుల్లో ఇది రెండోసారి అయింది. శరద్ పవార్‌ను తాము స్థానిక వైబి చవాన్ సెంటర్‌లో కలిసినట్లు అజిత్ వర్గం తెలిపింది. 

అజిత్ పవార్ ఆయన వెంట 15 మంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు. తాము శరద్ పవార్‌ను కలుసుకుని పార్టీ సమైక్యంగా ఉండేలా చూడాలని కోరామని, ఇంతకు మించి ఏమీలేదని ఈ వర్గానికి చెందిన రాజ్యసభ ఎంపి ప్రఫుల్ పటేల్ విలేకరులకు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిక , శరద్‌తో విభేధించడం వంటి అంశాలలో ఎటువంటి సర్దుబాట్లు లేవని పటేల్ స్పష్టం చేశారు. తమ మధ్య నమ్మక దూరం పెరిగిందని, ఇక అటు వెళ్లడం కుదరదని తేల్చి చెప్పారు.

ఇప్పుడు శరద్ పవార్‌ను కలుసుకోవడం కేవలం ఆయన పట్ల తమకు ఉన్న గౌరవ మర్యాదలను చాటుకునేందుకే అని చెప్పారు. ఇక ఢిల్లీలో జరిగే ఎన్‌డిఎ భూటీకి అజిత్ పవార్ వెళ్లుతున్నారని వివరించారు. 

కాగా ఎన్‌సిపి చీలిక వర్గం శరద్ పవార్‌ను కలుసుకోవడం విఫలయత్నం అని ఎన్‌సిపి జాతీయ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో తెలిపారు. ఇప్పటికే విశ్వాసపు బ్రిడ్జి నుంచి చాలా నీరు కొట్టుకుపోయిందని పేర్కొన్నారు. తాము పవార్‌ను సముదాయించగలమని మరాఠీలకు తెలియచేసుకునే క్రమంలోనే వీరు అక్కడికి వెళ్లారని, అయితే ఇది విఫలమైందని తెలిపారు.