ఏపీ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా

* అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి సమాచారం అందించింది. ఆయనను తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. సాయంత్రం 5 గంటల లోపు అధికారికంగా బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ నియామకం కోసం ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. ఈ ప్యానెల్​లో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్‌కుమార్ గుప్తా పేర్లు ఉన్నాయి. వీరిలో  సీనియర్ ఐపీఎస్ అయినా  హరీష్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. 

హరీష్‌కుమార్‌ గుప్తా హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా రాజేంద్రనాథరెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయనే డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. 

ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదులపై చాలా ఆలస్యంగా స్పందించింది. ఎన్నికల్లో వైసీపీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికల సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది.

సీఎం జగన్‌ మోహన్ రెడ్డి డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పక్కన పెట్టేసి మరీ 2020 ఫిబ్రవరి 15న కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా నియమించారు. రెండేళ్ల రెండు నెలలుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోం శాఖ పదే పదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ఆదేశాలను పట్టించుకోలేదు.

 తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కూడా ఈసీ బదిలీ వేటు వేసింది. అమ్మిరెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఈసీ ఆదేశించింది. అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. డీఐజీ అమ్మిరెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఈసీ ఈ మేరకు చర్యలకు తీసుకుంది. 

ఇటీవల అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌ను బదిలీ చేసిన ఈసీ ఆయన స్థానంలో అమిత్‌ బర్దర్‌ను నియమించింది. అనంతపురం అర్బన్‌ డీఎస్పీగా ప్రతాప్‌ కుమార్‌, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు 10 మంది ఐపీఎస్ లపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. అధికార వైసీపీకి మద్దతుగా ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసింది.