మాతృభూమి అభివృద్ధికోసం తపించే మీరే మాకు స్ఫూర్తి

ఉద్యోగాలకోసం జన్మభూమిని, మాతృదేశాన్ని వదిలి వచ్చినా మన దేశ అభివృద్ధి గురించి ప్రవాసీయులు చేస్తున్న ఆలోచనలు తమలో స్ఫూర్తి రగిలిస్తాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు. అధికారిక పర్యటన కోసం న్యూయార్క్‌ కు చేరుకున్న సందర్భంగా అమెరికాలోని భారత కాన్సుల్ జనరల్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రవాసీ భారతీయులతో ఆత్మీయంగా సంభాషించారు. 

భారతదేశం నేడు సాధిస్తున్న విజయాల్లో, ప్రపంచ ఫార్మారంగ రాజధానిగా, ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ గా ఎదుగుతున్న క్రమంలో దేశ యువతతోపాటు, ప్రవాస భారతీయులు పోషిస్తున్న పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. అమెరికా గడ్డపై ప్రతి భారతీయుడు మన దేశపు రాజదూత (అంబాసిడర్)గా, దేశ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ప్రశంసించారు. 

గతంలో ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటే నేడు భారతదేశం ఎన్నో రెట్లు ముందడుగేస్తోందన్న కిషన్ రెడ్డి ప్రపంచమంతా ఇవాళ ఆర్థికమాంద్యం ప్రభావంలో ఉంటే భారతదేశం మాత్రం దీని కోరల్లో చిక్కుకోకుండా స్థిరమైన అభివృద్ధితో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. నరేంద్రమోదీ సర్కారు అవలంబిస్తున్న విధానాల కారణంగానే భారతదేశం కరోనా సమయంలోనూ స్థిరంగా ఉందని చెప్పారు.

ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారతదేశానికి ఏటా 3 బిలియన్ డాలర్ల  విదేశీ పెట్టుబడులు భారతదేశానికి వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.  2014-15లో ఉన్న విదేశీ మారక నిల్వలు (45.15 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే,  మే, 2023 నాటికి దేశంలో 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలున్న విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు. 

2022-23లో వాణిజ్య, సేవల ఎగుమతుల విలువ 750 మిలియన్ డాలర్లు దాటిన విషయాన్నీ కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ప్రధానమంత్రి మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర భారత్’ నినాదాన్ని ఇచ్చినపుడు దేశంలోని చాలా మంది మేధావులు, విపక్ష నేతలు వ్యంగ్యంగా మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. 

అయితే,  2014లో దేశంలో శూన్యంగా ఉన్న మొబైల్ ఎగుమతులు ఇవాళ రూ.43,500 కోట్లు దాటిన విషయాన్ని ప్రస్తావించారు. సేవల రంగంలోనూ భారత్ సత్తాచాటుతోందని చెబుతూ స్టార్టప్ లకు ప్రోత్సాహం, కారణంగా ప్రపంచ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ ను భారతదేశ నిర్మించుకుందని చెప్పారు. ఇందులో 85వేల స్టార్టప్‌లు ఉన్నాయని తెలిపారు. 

దేశంలో 100కు పైగా యూనికార్న్స్ ఉన్నాయని, వీటి విలువ 350 బిలియన్ డాలర్లకు పైమాటే అని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 14 కీలక రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వడం తదితర కార్యక్రమాల కారణంగా ఈ దశాబ్దిని భారతదేశం ‘టెక్ డెకేడ్’ (టెకేడ్) మార్చుకునే లక్ష్యంతో ముందుకెళ్తోందని వెల్లడించాయిరు. 

వివిధ అంతర్జాతీయ అభివృద్ధి సూచీల్లోనూ భారతదేశం 2014తో పోలిస్తే అత్యుత్తమ ర్యాంకింగ్స్ తో ముందుకెళ్తోందని చెబుతూ  కరోనా మహమ్మారి ప్రభావం సమయంలో, ఆ తర్వాత ప్రపంచంలోని నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సందర్భంలోనూ భారతదేశం ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా,  స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని స్పష్టం చేశారు.

కరోనానంతర పరిస్థితుల్లో భారత పర్యాటక రంగం, ఆతిథ్య పరిశ్రమ అభివృద్ధి బాట పడుతుండటాన్ని గుర్తుచేస్తూ  గతంలో ప్రధానమంత్రి చెప్పినట్లుగా ఒక్కో ప్రవాసీ భారతీయుడు కనీసం ఐదుగురు భారతీయేతర మిత్రులను మనదేశంలో పర్యటించేందుకు ప్రోత్సహించాలని కోరారు.

మరో అడుగు ముందుకేసి.. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా.. భారతీయేతర మిత్రులను ప్రోత్సహించాలని కేంద్రమంత్రి సూచించారు.
ప్రస్తుతం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న మనం వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టేందుకు భారతీయులతోపాటు.. ప్రవాసీయులు కూడా మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.