అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌లో అంతర్భాగమే :యూఎస్‌ సెనేట్

అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ అంతర్భగంగా గుర్తిస్తూ అమెరికా కాంగ్రెస్ సెనేటోరియల్ కమిటీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సెనేటర్లు జెఫ్ మెర్క్లీ, బిల్ హాగెర్టీ, టిమ్ కైన్, క్రిస్ వాన్ హోలెన్ ప్రవేశపెట్టారు.  పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా మెక్‌మాన్ రేఖను అమెరికా గుర్తిస్తుందని తీర్మానం పేర్కొంది.

ఇప్పుడు ఈ తీర్మానం పూర్తి ఓటింగ్ కోసం సెనేట్ ఫ్లోర్ కు వెళుతుంది. అరుణాచల్ ను భారత్ లో అంతర్భాగంగా చూడడంతో పాటు ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన భాగస్వాములతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు ఆ తీర్మానం పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ ను చైనా దక్షిణ టిబెట్ గా పిలుస్తోంది. భారత ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తోంది. 

ఆ రాష్ట్రంతో భారత్ కు విడదీయరాని బంధం ఉందని, ఇది తమ దేశ అంతర్భాగమని భారత్ చెబుతోంది. ఈ తీర్మానం అరుణాచల్ ప్రదేశ్  రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో భాగమని ధృవీకరిస్తోందని, కానీ చైనాలో భాగం కాదని సెనేటర్ మెర్క్లీ పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి మరింత మద్దతు, సహాయాన్ని అందించడానికి అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు.

చైనా విస్తరణ వ్యూహానికి వ్యతిరేకంగా భారత్ సహా వ్యూహాత్మక భాగస్వాములకు అండగా ఉంటామని హాగెర్టీ తెలిపారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో – పసిఫిక్ కు అమెరికా మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడుతుందని సెనేటర్ కార్నిన్ చెప్పారు. భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో భాగంగా అమెరికా గుర్తిస్తోందని చెప్పారు. ఈ తీర్మానాన్ని ఆలస్యం లేకుండా ఆమోదించాలని సహ సెనేటర్లఆయన కు విజ్ఞప్తి చేశారు.