మౌలిక సదుపాయాల కల్పనతోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు

మౌలిక సదుపాయలతోనే నిరుద్యోగ  నిర్మూలన చేయగలం అని నమ్మిన మన ప్రధాని నరేంద్ర మోదీ  నీరు, విద్యుత్, రహదారులు, కమ్యునికేషన్ వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. ప్రరిశ్రమల స్థాపనకు ఈ మౌలిక సదుపాయాలు లేకుంటే పారిశ్రామిక పెట్టుబడులు రాక  నిరుద్యోగ సమస్యను తీర్చలేమని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో కొత్తగా 3 జాతీయ రహదారులకు గురువారం తిరుపతి నుండి శంఖుస్థాపన  జరిపారు. కేంద్ర మంత్రి కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీ ప్యాకేజ్ 2,3,4 జాతీయ రహదారుల నిర్మాణానికి డిజిటల్ విధానంలో శంఖుస్థాపన చేశారు. 2014 లో మంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటికి ఆంధ్రప్రదేశ్ లో 4193 కిమీ జాతీయ రహదారులు వుంటే, అది నేడు  2023 నాటికీ 8744 కిమీ లకు చేరి దాదాపు రెండింతల నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు.

పోర్ట్ లకు ప్రాముఖ్యత కలిగిన ఆంద్రప్రదేశ్ కు దేశంలోనే ప్రముఖ పోర్ట్ గా ప్రసిద్ది గాంచిన విశాఖపట్నం ఉండగా,  రాష్ట్ర ప్రభుత్వం మరో 3 పోర్ట్ ల ఏర్పాటుకు ఆసక్తి కనబరిచిందని సంతోషం అని ఆయన చెప్పారు. పోర్ట్ లు దేశాభివృద్ధికి తోడ్పతాయని చెబుతూ  2023 నాటికి 91 వివిధ ప్రాజెక్టులు 3240 కిమీ రూ.50 వేల కోట్లతో పూర్తీ చేస్తున్నామని వెల్లడించారు. 

మరో రూ.75 వేల కోట్లతో 190   ప్రాజెక్టులు పలు దశల్లో వున్నాయని, త్వరలో పూర్తి కానున్నాయని  గడ్కరీ తెలిపారు. రూ 20 వేల కోట్లతో 25 ప్రాజెక్టులు 800 కిమీ, రూ.50 వేల కోట్లతో 45 ప్రాజెక్టులు 1800 కిమీ ఏర్పాటు కానున్నాయని చెప్పారు. ప్రత్యేకంగా  19 వేల కోట్లతో 430 కిమీ పోర్ట్ ల అనుసంధాన పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఆంద్రప్రదేశ్ లో దాదాపు రూ. 2 లక్షల కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెబుతూ విదేశీ, దేశీయ పెట్టుబడులతో ప్రరిశ్రమల స్థాపనకు మొగ్గు చూపుతున్నారని దీనికి రవాణా సౌకర్యం కారణమని తెలిపారు. ఒక్క తిరుపతి జిల్లాలోనే రూ. 17 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని, 2024 నాటికీ పూర్తీ కానున్నాయని చెప్పారు. 

ఇప్పటికే రూ.4 వేల కోట్లతో పనులు పూర్తీ అయ్యాయని, మరో రూ.13 వేల కోట్లతో జరుగుతున్న కడప – రేణిగుంట , తిరుపతి – మదనపల్లి, రేణిగుంట – నాయుడుపేట 6 లేన్ వంటి రహదారులు 2025 నాటికి పూర్తీ కానున్నాయని గడ్కరీ తెలిపారు. 

కృష్ణపట్నం పోర్ట్  సమీపంలో నాయుడుపేట – తూర్పు కనుపూరు 6 లేన్ల రహదారి 35 కి.మీ రూ.1399 కోట్లు, చిల్లకారు క్రాస్ నుండి తూర్పు కాన్పూర్ వరకు 4 లేన్ల రహదారి,   తూర్పు కాన్పూర్ నుండి కృష్ణపట్నం పోర్ట్ సౌత్ గేట్ 6 లేన్ల రహదారి 36 కి.మీ రూ. 909 కోట్లు, తమ్మినపట్నం నుంచి నారికెళ్లపల్లెను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 4 లేన్లు,  పోర్ట్ రోడ్డు పొడిగింపు 6 లేన్ల రహదారి 16 కి.మీ రూ. 610 కోట్లు తో నేడు శంఖుస్థాపనలు చేశారు. 

కృష్ణపట్నం పోర్టుకు వేగవంతమైన కనెక్టివిటీ కోసం  నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నేషనల్ మాస్టర్ ప్లాన్ నోడ్స్. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, నెల్లూరు వద్ద ఎస్ ఇ జెడ్ పారిశ్రామిక నోడ్‌ల వల్ల అందుబాటులోకి రానున్నదని కేంద్ర మంత్రి తెలిపారు. తిరుపతి ఇంటర్ మాడల్ సెంట్రల్ బస్ టర్మినల్ కు   2022 ఆగష్టు 18 లో ఎపిఎస్ ఆర్టిసితో  ఎం.ఓ.యు జరిగిందని, టెండర్ ఈ జూలైలో పూర్తి కానున్నదని చెప్పారు.

గ్రీన్ ఫీల్డ్  ఎక్స్ ప్రెస్ హై వే నిర్మాణంపై దృష్టి పెట్టామని చెబుతూ ఎపి లో 7 గ్రీన్ ఫీల్డ్  ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణాలు చేపట్టిన్నట్లు గడ్కరీ వెల్లడించారు.  బెంగళూరు – చెన్నై, బెతమంగల – గుడిపాల, చిత్తూరు – తచ్చురు ప్రధానంగా వున్నాయని చెప్పారు. ప్రస్తుత  ప్రముఖ పట్టణాలు బెంగళూరు – చెన్నై ప్రయాణ సమయం 6 నుండి 7 గంటలు వుందని, గ్రీన్ ఫీల్డ్  ఎక్స్ ప్రెస్ హై వే పూర్తి అయితే 2.30 గంటల సమయం పడుతుందని తెలిపారు. 

దేశంలో కాశ్మీర్ – కన్యాకుమారి వరకు, సూరత్ – చెన్నై, మనాలి, శ్రీనగర్ –జమ్ము వంటి ప్రాజెక్టులు వివిధ దశల్లో వున్నాయని వివరించారు. అన్ని దక్షిణ ప్రాంత రాజధాని నగరాలను అనుసందానం చేయనున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. బెంగళూరు – విజయవాడ గ్రీన్ ఫీల్డ్  ఎక్స్ ప్రెస్ హై వే ఎపి లో 5 జిల్లాల మీదుగా వెల్లనున్నదని తెలిపారు.