ఆర్టికల్​ 370 రద్దుపై ఆగస్టు 2 నుంచి `సుప్రీం’ విచారణ

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370ని కేంద్రం రద్దు చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారించనుంది. సంబంధిత వ్యాజ్యాలపై రోజువారీ విచారణ చేపట్టనున్నట్టు మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది.

“ఆర్టికల్​ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 2 ఉదయం 10:30 గంటల నుంచి విచారణ జరుపుతుంది. సోమ, శుక్ర మినహాయించి రోజువారీ పద్ధతిలో విచారణ జరుగుతుంది,” అని భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​ తెలిపారు.

ఆర్టికల్​ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టులో భారత పార్లమెంట్​ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో జమ్ముకశ్మీర్​ పునర్విభజన చట్టానికి కూడా ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించాయి. అనంతరం జమ్ముకశ్మీర్​లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు వెలుగులోకి వచ్చింది.

ఆ తర్వాత ఆర్టికల్​ 370 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అప్పట్లో విచారణ జరిపింది అత్యున్నత న్యాయస్థానం. తిరిగి మూడేళ్ల తర్వాత ఆగస్టు 2 నుంచి విచారణను కొనసాగించనుంది. ఆర్టికల్​ 370 రద్దుకు వ్యతిరేకంగా గతంలో వ్యాజ్యలు దాఖలు చేసిన ఐపీఎస్​ అధికారి షా బైజల్​, సామాజిక కార్యకర్త షెహ్లా రషీద్​లు తమ పేర్లను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు. వారి అభ్యర్థనలను సుప్రీంకోర్టు తాజాగా అంగీకరించింది.

మరోవైపు జమ్ముకశ్మీర్​ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంది. ఈ మేరకు సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్​ను దాఖలు చేసింది. టెర్రర్​ నెట్​వర్క్​పై సమర్థమైన పోరాటానికి తమ నిర్ణయం ఉపయోగపడిందని వెల్లడించింది. వీధుల్లో హింసాత్మక ఘటనలు తగ్గిపోయాయని, రాళ్లు రువ్వే ఘటనలు పూర్తిగా కనుమరుగైపోయాయాని పేర్కొంది.