ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాకల్టి కొరత

రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభించారు. విద్యారంగంతో సంబంధం లేని వారు సహితం, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒక వ్యాపార ప్రక్రియగా ప్రారంభించారు. ఈ కాలేజీలలో సాంకేతిక విద్యపట్ల ఆసక్తితో విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. సీట్లు మాత్రం తేలికగా భర్తీ అవుతున్నాయి.

అయితే, ప్రభుత్వపరంగా వాటి పర్యవేక్షణ లోపించడంతో విద్యా ప్రమాణాలని గాలికి వదిలివేస్తున్నారు. ఆ కారణంగా ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన వారిలో 10 నుండి 15 శాతంకు మించి తమ చదువుకు తగిన ఉద్యోగాలు పొందలేక వాపోతున్నారు. ముఖ్యంగా అర్హత కలిగిన అధ్యాపక సిబ్బంది ఈ కాలేజీల్లో ఉండటం లేదు. తెలంగాణాలో విద్యార్థులు సంఖ్యతో పోల్చుకుంటే దాదాపు సంగం మంది అధ్యాపకుల కొరత వెంటాడుతుంది.

ఇంజనీరింగ్‌ సీట్లకు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు తరగతులు బోధించేందుకు కావాల్సిన ప్రొఫెసర్లను నియమించుకోవడం లేదు. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా వెంటాడుతోందని పలు ఉద్యోగ సంఘాల నేతలు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. ఒక్క ఫ్యాకల్టియే కాదు సరైనా ల్యాబ్‌లు, మౌలిక వసతులు ఉండడంలేదు.

సీట్ల పెంపు, కోర్సుల కన్వర్షన్‌పై ఉన్న ఆసక్తి ప్రొఫెసర్లను నియమించుకోవడంలో కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. నాన్‌ అటానమస్‌ కాలేజీలో దాదాపు ప్రతి 20 మంది విద్యార్థులకు ఒకరు, అటానమస్‌ కాలేజీలో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 

కానీ ఈ నిబంధనలను చాలా కాలేజీలు పాటించడం లేదు. బ్రాంచీలకు అనుగుణంగా ప్రొఫెసర్లు దొరకపోవడంతో ఉన్న ఫ్యాకల్టినే కొత్త కోర్సుల కోసం వినియోగించుకుంటున్నారు. సహాయ ఆచార్యుడిగా నియమించాలంటే బీటెక్‌, ఎంటెక్‌ చేయడంతో పాటు ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ కావాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌కు విద్యార్థుల్లో చాలా క్రేజ్‌ ఉంది. దీనికి అనుబంధ కోర్సులైన (ఎమర్జింగ్‌ కోర్సులు) సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, డాటా సైన్స్‌, ఐవోటీ, సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల సీట్లను చాలా కాలేజీలు మార్చుకున్నాయి.

అయితే సీట్లు, కోర్సులు మార్చుకున్న కాలేజీలు మాత్రం ప్రొఫెసర్లను నియమించుకోవడంపై ఏమాత్రం దృష్టా సారించడం లేదు. ఉన్న వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సారి దాదాపు 14,565 సీట్లకు అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో 6390 సీట్లను సీఎస్‌ఈలోకి మార్చుకుంటే, కొత్తగా 7635 సీట్లకు ప్రభుత్వం ప్రైవేట్‌ కాలేజీలకు అనుమతినిచ్చింది. 

రాష్ట్రంలో మొత్తం లక్షకు పైగా సీట్లు ఉన్నాయి. నాన్‌ సర్క్యూట్‌ బ్రాంచి అధ్యాపకులను కొత్త కోర్సుల కోసం ట్రైనింగ్‌ ఇప్పించి వారితోనే విద్యార్థులకు తరగతులు చెప్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సాంప్రదాయ కోర్సులైన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ సీట్లను రద్దు చేసుకోవడంద్వారా ఆయా సబ్జెక్టులు బోధించే ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి.

రాష్ట్రంలో మొత్తం సుమారు 170 కాలేజీలు ఉంటే, వాటిల్లో  దాదాపు 137 వరకు ప్రైవేట్‌ కాలేజీలే ఉన్నాయి. 2.60 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 14వేల మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుంటే మిగిలి విద్యార్థులంతా ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనే చదువుతున్నారు. ప్రస్తుత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా దాదాపు 45 వేల మంది వరకు అధ్యాపకుల అవసరం ఉన్నట్లుగా ఓ అంచనా. కానీ ప్రస్తుతం పనిచేస్తుంది మాత్రం సుమారు 22 వేల మందే ఉన్నట్లు సమాచారం. అయితే అధికారులు తనిఖీలకు వచ్చినప్పడు మాత్రం కాగితాల్లో చూపించే సరిపెట్టుకుంటున్నారు.

సీట్లు, కోర్సుల కన్వనర్షన్‌, పెంపుకు అనుమతులిచ్చే అధికారులు కాలేజీల్లో సరిపడా, అర్హత కలిగిన ఫ్యాకల్టి ఉన్నారా? లేదా? అనే దానిపై పట్టించుకోవడం లేదు. అటువంటి కళాశాలలకు కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని కాలేజీలు కళాశాలలో పనిచేయని అధ్యాపకులను ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగితాల్లో మాత్రంమే అధ్యాపకులు పనిచేస్తున్నట్లుగా ఉంటారు గానీ, తరగతి గది బోధనలో మాత్రం వారు కనిపించరని టీఎస్‌టీసీఈఏ అధ్యక్షులు సంతోష్‌ కుమార్‌ ఆరోపించారు.