అడ్మిషన్లు రద్దు చేసుకుంటే ఫీజు రీఫండ్ చేయాల్సిందే

ఒక కాలేజీలో సీటు పొందిన త‌ర్వాత‌ మ‌ళ్లీ సెకండ్ ఫేజ్‌లో మ‌రో కాలేజీలో సీటు పొందిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని యూనివ‌ర్సిటీ గ్రాంట్ క‌మిష‌న్ (యూజీసీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫ‌స్ట్ ఫేజ్‌లో సీటు రావ‌డంతో ఫీజు చెల్లించిన విద్యార్థులు మ‌ళ్లీ సెకండ్ ఫేజ్‌లో వేరే కాలేజీలో సీటు పొందితే మొద‌ట‌గా చెల్లించిన ఫీజును స‌ద‌రు విద్యార్థి పొంద‌లేక‌పోతున్నాడు.
ఆయా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అలాంటి విద్యార్థుల‌కు, వారి త‌ల్లిదండ్రుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తూ యూజీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2023-24 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి ఫీజులు రీఫండ్ పొందేందుకు యూజీసీ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోపు అడ్మిషన్లు రద్దుచేసుకున్నా, మరో కాలేజీలో చేరినా విద్యార్థులు చెల్లించిన పూర్తి ఫీజును రీఫండ్ చేయాలని ఉన్నత విద్యాసంస్థలను యూజీసీ ఆదేశించింది. విద్యాసంస్థ విడుదల చేసిన ప్రాస్పెక్టర్స్‌, నోటిఫికేషన్‌ల్లో ఏ నిబంధనలున్నా వాటితో సంబంధం లేకుండా సెప్టెంబర్‌ 30లోపు విద్యార్థులు అడ్మిషన్లు రద్దుచేసుకున్నా, మరో కాలేజీకి మారినా ఫీజు మొత్తాన్ని సంబంధిత విద్యార్థి ఖాతాకు బదలాయించాలని యూజీసీ ఆదేశించింది.

ఇక విద్యార్థి అక్టోబర్‌ 31లోపు అడ్మిషన్లు రద్దుచేసుకుంటే ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ. 1000 మాత్రమే మినహాయించుకోవచ్చు. ఇక అక్టోబర్‌ 31 తర్వాత అడ్మిషన్ల రద్దు, ఫీజుల వాపస్‌పై యూజీసీ కొన్ని స్లాబులను విధించింది. అడ్మిషన్ల గడువు పూర్తయ్యి 30 రోజుల ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫీజుల వాపసు చేయరు.