డిజిటలైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు

సుప్రీం కోర్టులో డిజిటలైజేషన్ దిశగా మరో ముందడుగు పడింది. సోమవారం నుంచి మూడు కోర్టులు పూర్తిగా పేపర్‌లెస్ గ్రీన్‌హైటెక్ విధానాన్ని అమలు లోకి తీసుకు వచ్చాయి. 73 ఏళ్ల చరిత్రలో న్యాయవ్యవస్థలో పూర్తిగా పేపర్‌లెస్‌గా మారడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత ఏడాది సుప్రీం కోర్టు నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణ లైవ్‌స్ట్రీమ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

తాజాగా ఉచిన వైపై సేవలను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దీనిపై ప్రకటన చేశారు. “సుప్రీం కోర్టు లోని ఐదు కోర్టు గదుల్లో ఉచిత వైపై ని అందుబాటులోకి తీసుకొచ్చాం. బార్ రూమ్‌ల్లోనూ ఈ సదుపాయం ఉంది”. అని తెలిపారు.

‘సుప్రీం కోర్టులోని ఐదు కోర్టు గదుల్లో ఉచిత వైపైని అందుబాటులోకి తీసుకొచ్చాం. బార్ రూమ్‌ల్లోనూ ఈ సదుపాయం ఉంది. త్వరలోనే అన్ని కోర్టు గదులకు ఈ సేవలను విస్తరిస్తాం. డిజిటలైజేషన్ దిశగా ఇదో కీలకమైన ముం దడుగు. ఇకపై న్యాయ పుస్తకాలు, పేపర్లు కనిపిం చవు. అయితే దానర్థం… మేం పుస్తకాలు, పేపర్లపై ఆధారపడబోమని కాదు” అని తెలిపారు.

 సుప్రీంకోర్టులో ఇఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఉచిత వైపై సేవలను ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే లాయర్లు, వ్యాజ్య దారులు, మీడియా వ్యక్తులు, ఇతరులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని న్యాయస్థానం వెల్లడించింది. ప్రస్తుతానికి సీజేఐతోపాటు 2,3,4,5 కోర్టు గదుల్లో ఈ వైపైసేవలు ఉన్నాయి. దీంతోపాటు కారిడార్, ప్లాజా, వెయిటింగ్ ఏరియా, క్యాంటీన్, ప్రెస్ లాన్ 1.2, ప్రాంతాల్లో ఈ ఉచిత సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు కోర్టు తమ ప్రకటనలో వెల్లడించింది.

ఆరు వారాల వేసవి సెలవులను ముగించుకుని సుప్రీం కోర్టు సోమవారమే తిరిగి ప్రారంభమైంది. సోమవారం నుంచి అనేక కీలక కేసులను న్యాయస్థానం విచారించనున్నది. యూపీలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అష్రఫ్‌లను పోలీస్‌ల సమక్షంలోనే హతమార్చడంపై వచారణకు కమిషన్‌ను నియమించాలని కోరుతూ దాఖలైన పిటిషన్, మణిపూర్ అల్లర్లు, వంటి కేసులపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనున్నది.

పురుషుల హక్కుల పరిరక్షణకు జాతీయ కమిషన్ ఏర్పాటు, స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత, ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మొదలయ్యాక అర్హత నిబంధనలను మార్చడానికి ప్రభుత్వాలకు ఉన్న అవకాశం, ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటు , 370 అధికరణం రద్దు, బిల్కిస్ బానో కేసులో 11 మంది ముద్దాయిలకు విముక్తి కల్పించడం తగదన్న పిటిషన్ వంటివన్నీ విచారణకు రానున్నాయి.