ప్రధాని మోదీ 8న వరంగల్ పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8 న తెలంగాణలోని వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ  కాజీపేట వ్యాగన్ ఓవన్ హాలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

జులై 8న వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9.45 గంటలకు ప్రధాని మోదీ హైదరాబాద్‌లోని హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి 9.50 నిమిషాలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.

ఆ తర్వాత 10.35 గంటలకు వరంగల్‌లోని హెలిప్యాడ్‌కు మోదీ  చేరుకోనున్నారు. 10.45 గంటల నుంచి 11.20 గంటల వరకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు ప్రధాని హాజరై ప్రసంగించనున్నారు.

ఆ సభ ముగించుకుని 12.15 గంటలకు వరంగల్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ్నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. గత ఆదివారమే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వరంగల్ వెళ్లి ప్రధాని పర్యటన ప్రాంతాలను పరిశీలించారు.