ఉద్యోగుల అజాగ్రత్త వల్లే ఒడిశా రైలు ప్రమాదం

దేశ, విదేశాలలో దిగ్భ్రాంతి కలిగించిన ఒడిశా రైలు ప్రమాదం ఉద్యోగుల అజాగ్రత్త వల్లే జరిగిందని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ చేసిన అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది.  జూన్ 2 రాత్రి 7 గంటల సమయంలో ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన అత్యంత ఘోర రైలు ప్రమాద యావత్ దేశాన్ని తీవ్రంగా కలిచి వేసింది.
 
సిగ్నలింగ్‌, టెలి కమ్యూనికేషన్‌ విధుల్లో ఉన్న ఉద్యోగులు సరైన విధంగా స్పందించకపోవడం వల్లే ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బహానగాలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం జరిగినట్లు కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ నివేదిక రూపొందించింది. దానికి సంబంధించి రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదికను కూడా అందజేసింది.
 
సంబంధిత సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోనే లూప్‌లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని తెలిపింది. ఆ తర్వాత దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడగా, అటుగా వస్తున్న మరో రైలు ఢీకొట్టి పట్టాలు తప్పినట్లు అందులో పేర్కొంది. అయితే ఈ ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ అధికారుల బృందం దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ  నివేదికను బహిర్గతం చేయడం లేదని తెలుస్తోంది.
 
ఒడిశా రైలు ప్రమాదంలో ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో సీబీఐ బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా రైల్వే శాఖ ఉద్యోగులు, సిబ్బంది సహా పలువురిని ఇప్పటికే సీబీఐ అధికారులు విచారణ జరిపారు. మరోవైపు ఆగ్నేయ రైల్వేలో జనరల్‌ మేనేజర్‌గా ఉన్న అర్చన జోషిని ఉన్నతాధికారులు బదిలీ చేశారు. అర్చన జోషి స్థానంలో అనిల్‌కుమార్‌ మిశ్రను నియమించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
 
ఈ ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన మరో 13 మంది ప్రయాణికుల మృతదేహాలను అధికారులు శనివారం వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ మృతదేహాలు అన్నింటిని భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో భద్రపరిచారు. ఇటీవల డీఎన్‌ఏ టెస్టుల ద్వారా గుర్తించిన 29 మృతదేహాలలో శుక్రవారం 6, శనివారం 13 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు రైల్వే శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో ఇంకా గుర్తుపట్టని మృతదేహాలు 62 ఉన్నాయని అధికారులు వెల్లడించారు.