రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, వ్యాగన్ ఫ్యాక్టరీకి తేడా లేదు

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, వ్యాగన్ ఫ్యాక్టరీకి పెద్దగా తేడా  లేదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  స్పష్టం చేశారు.  ఆదివారంనాడు వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే  బహిరంగ సభ స్థలాన్ని  ఇతర బీజేపీ నేతలతో కలిసి పరిశీలించి, రైల్వే అధికారులతో  ప్రధాన మంత్రి  రైల్వే వ్యాగన్ల తయారీ  ఫ్యాక్టరీకి శంకుస్థాపన  ఏర్పాట్ల గురించి  చర్చించారు.
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏ ఫ్యాక్టరీ  అయితేనేం  ఈ ప్రాంత ప్రజలకు  ఉపాధి కల్పించే  ఉద్దేశ్యంతో వ్యాగన్ల ఫ్యాక్టరీని  కేంద్రం ప్రారంభించనుందని తెలిపారు. ఈ నెల 8న కాజీపేటలో రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెబుతూ మోదీకి  స్వాగతం పలికేందుకు వరంగల్ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.
 
కాజీపేటలో నెలకు 200 వ్యాగన్లు తయారు చేసే సామర్ధ్యంతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టుగా కిషన్ రెడ్డి వివరించారు.  అలాగే రూ. 587 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు. రూ. 1127 కోట్లతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే కు, రూ.5587 కోట్లతో నిర్మించే జాతీయ రహదారుల నిర్మాణం పనులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
 
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్ధితో పాటు చారిత్రాత్మక ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వివక్ష లేకుండా అభివృద్దే ధ్యేయంగా మోదీకి  ప్రభుత్వం పని చేస్తుందని అంటూ వరంగల్ కు వస్తున్న ప్రధానమంత్రికి వరంగల్ ప్రజలు ఘన స్వాగతం పలకాలని పిలుపు ఇచ్చారు. వరంగల్ కు చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ తొలుత భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
 
ఆ తర్వాత రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, రహదారుల భూమి పూజల్లో పాల్గొంటారని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్రం సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తమపై బురదచల్లుతుందనిమండిపడుతూ వరంగల్ కు టెక్స్ టైల్స్ పార్క్ కు కేంద్రం మంజూరు చేసిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైనిక్ స్కూల్ కు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని తెలిపారు.ఈ ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నా స్పందన లేదన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ  వెంటనే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు