సింహాచలం క్షేత్రంలో గిరిప్రదక్షిణ మహోత్సవం ప్రారంభం

విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరిప్రదక్షిణ మహోత్సవం ఆదివారం వైభవోపేతంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు తరలివచ్చారు. మధ్యాహ్నం 2.30గంటలకు తొలి పావంచా వద్ద విశాఖ నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. అశేష భక్తజనం రథాన్ని అనుసరించారు.
 
అడవివరం, హనుమంతవాకా, అప్పుఘర్‌ మార్గంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, జీవీఎంసీ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు అల్పాహారం, మజ్జిగ అందిస్తున్నాయి. కోనసీమ, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు .

ఆషాఢ పూర్ణిమను సింహాచలంలో గిరిపున్నమి అని వ్యవహరిస్తారు. అక్షయ తృతీయ నుంచి నాలుగు విడతలుగా చందన సేవను స్వీకరించిన సింహాద్రి అప్పన్న గిరిపున్నమి నాటికి సంపూర్ణ రూపాన్ని ధరిస్తాడు. పున్నమికి ముందురోజు సాయంకాలం నుంచి 32 కిలోమీటర్ల దూరం కాలినడకన సింహాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వేలాది భక్తులు పున్నమినాడు స్వామి దర్శనం చేసుకుంటారు.
సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం. అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి.
 
తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే. ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.
 
అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్ప బడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది. దాంతో ఆ రాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. అలాగే ఈసందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు.
 
అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 12రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది. పున్నమికి ముందురోజు సాయంకాలం నుంచి 32 కిలోమీటర్ల దూరం కాలినడకన సింహాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వేలాది భక్తులు పున్నమినాడు స్వామి దర్శనం చేసుకుంటారు.
 
పరమాత్మ సర్వవ్యాపకుడు. ఈ సందేశాన్ని మనకు అందించినవాడు సింహాచలస్వామి. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు సింహాచల వరాహలక్ష్మీ నరసింహుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. అప్పటి నుంచి వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాల్లో పూర్ణిమ తిథుల్లో నాలుగు విడతలుగా స్వామికి చందనం సమర్పణ చేస్తారు.
 
 ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి కొండ దిగువన ఉన్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులుమరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు, ఆలయంలోనే ప్రదక్షిణం చేస్తారు.