పాక్ జైళ్లలో 308 మంది భారతీయ ఖైదీలు

పాకిస్థాన్ ప్రభుత్వం తమ జైళ్లలో ఉన్న 308 మంది భారతీయ ఖైదీల జాబితాను పాకిస్థాన్ లోని భారత హైకమిషన్‌కు శనివారం అందజేసింది. వీరిలో 42 మంది పౌరులు, 266 మంది మత్స కార్మికులు ఉన్నారు. ఉభయ దేశాల మధ్య కుదిరిన దౌత్యపరమైన ఒప్పందం మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఉభయ దేశాలూ తమ జైళ్లలో ఉన్న ఖైదీల వివరాలతోజాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇదే విధంగా భారత ప్రభుత్వం కూడా భారత్‌లో బందీగా ఉన్న పాకిస్థానీ ఖైదీల జాబితాను పాక్‌కు అందజేసింది. ఈ జాబితా ప్రకారం 417 మంది పాకిస్థాన్ ఖైదీలు భారత్ జైళ్లలో ఉన్నారు.

వీరిలో 343 మంది పాకిస్థాన్ పౌరులు కాగా, 74 మంది మత్సకార్మికులు. వీరంతా శిక్ష పూర్తి చేసినవారని, అందువల్ల వారిని విడిచిపెట్టాలని పాకిస్థాన్ ప్రభుత్వ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. భారతీయ ఖైదీల భద్రత, రక్షణ, సంక్షేమం చూడాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ఈ సందర్భంగా 62 మంది పాక్ ఖైదీల జాతీయ హోదాను నిర్ధారించాలని భారత్ కోరింది.

రెండు దేశాల మధ్య 2008లో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1, జులై 1న రెండు సార్లు పరస్పరం తమ జైళ్లలో ఉన్న పొరుగు దేశ ఖైదీల వివరాలను అందిపుచ్చుకొంటారు.