ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రత, 38 మంది మృతి

ఇండోనేషియాలో భారీ భూకంపం..  7.7 తీవ్రత, 38 మంది మృతి
తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని. దీంతో సునామీ హెచ్చరిక జారీ కావడంతో పాటు వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ శక్తివంతమైన భూకంపంలో కనీసం 38 మంది మరణించగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  బలమైన ప్రకంపనల నేపథ్యంలో కొద్దిసేపు సునామీ హెచ్చరిక జారీ చేయడంతో వందలాది మంది ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు.
 
యూఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్ జిఎస్) ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.58 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. దీని కేంద్రం తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్‌లోని ఎండే నగరానికి 68 కిలోమీటర్ల ఉత్తర-వాయువ్య దిశలో ఉంది. భూకంపం చాలా తక్కువ లోతులో సంభవించడంతో ప్రకంపనలు తీవ్రంగా కనిపించాయి. అనంతరం అదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో సహా పలు ప్రకంపనలు నమోదయ్యాయి.
 
“38 మంది మరణించినట్లు ధృవీకరించబడింది, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి, సుమారు 2,000 మంది స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు,” అని జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఎంఏ) అధిపతి సుహార్యంతో ఒక పత్రికా సమావేశంలో తెలిపారు.  ఈ భూకంపం కారణంగా ఇండోనేషియా అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు.
అలలు 0.5 మీటర్ల నుండి మూడు మీటర్ల (1.6 నుండి 9.8 అడుగుల) ఎత్తు వరకు ఉండవచ్చని హెచ్చరించారు. ఫ్లోరెస్ ద్వీపంలోని మౌమెరే పట్టణ నివాసితులను కూడా ఎత్తైన ప్రదేశాలకు తరలించారు. ఆ ప్రాంతంలో 19 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు గల సునామీ అలలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.  “తూర్పు నుసా తెంగారా, దక్షిణ సులవేసి, పశ్చిమ నుసా తెంగారా ప్రావిన్సులలో ఈ భూకంపం సునామీని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని సునామీ మోడలింగ్ ఫలితాలు సూచిస్తున్నాయి,” అని ఇండోనేషియా వాతావరణ, శీతోష్ణస్థితి మరియు భూభౌతిక శాస్త్ర సంస్థ (బిఎంకేజీ) భూకంప, సునామీ డైరెక్టర్ విజయంతో పేర్కొన్నారు.
జపాన్ నుండి ఆగ్నేయాసియా మీదుగా పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఇండోనేషియా, దాని పొరుగు దేశాలు ఉన్నందున, అక్కడ తరచుగా భూకంపాలు సంభవించడం సర్వసాధారణం. ఈ ప్రాంతం భూకంప కార్యకలాపాలకు అత్యంత అనుకూలమైనది. 17 వేలకు పైగా ద్వీపాలతో కూడిన ఇండోనేసియా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలకు అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఒకటి. 
2000 సంవత్సరం తర్వాత ఇండోనేషియాలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం 2004లో సంభవించింది. సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన ఆ భూకంపం, ఆ ప్రాంతమంతటా 2,20,000 మంది మరణానికి కారణమైన సునామీని ప్రేరేపించింది.