ఒకప్పుడు క్రికెట్లో ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించిన వెస్టిండీస్ లేకుండా తొలిసారి వన్డే ప్రపంచకప్ జరగనుంది. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో భాగంగా శనివారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించడంలో విండీస్ విఫలమైంది.
స్వల్వ లక్ష్యాన్ని స్కాట్లాండ్ 43.3 ఓవర్లలోనే ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి విజయం సాధించింది. మాథ్యూ క్రాస్ (74 నాటౌట్), బ్రాండెన్ మెక్ముల్లెన్ (69) అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు.
వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, అకీల్ హొసీన్ చెరో వికెట్ తీసుకున్నారు. స్కాట్లాండ్ కట్టడి చేయడంలో విండీస్ పూర్తిగా విఫలమైంది. 2023 ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో ఇటీవల జింబాబ్వే, నెదర్లాండ్స్తో మ్యాచ్ల్లో ఓడిన వెస్టిండీస్ స్కాట్ల్యాండ్తో ఓడి టోర్నీకి అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది.
క్వాలిఫయర్స్లో తదుపరి ఒమన్, శ్రీలంకతో మ్యాచ్లు ఆడనుంది వెస్టిండీస్. ఈ మ్యాచ్లు గెలిచిన విండీస్కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది.
భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా.. ర్యాంకింగ్ల పద్ధతిలో నేరుగా వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాయి. ఈ క్వాలిఫయర్స్ నుంచి మరో రెండు జట్లు ప్రపంచకప్ టోర్నీకి క్వాలిఫై అవ్వాల్సి ఉంది. శ్రీలంక, జింబాబ్వే జట్లకు ప్రపంచకప్ అవకాశాలు అధికంగా ఉన్నాయి.
More Stories
కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా మూక హింస
రక్షణ, వాణిజ్య రంగాల్లో చైనా, రష్యా మరింత సహకారం
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట