తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ మృతి

తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో కీలక భూమిక పోషించిన ప్రముఖ గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ (39) గుండెపోటుతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామంలోని ఆయన నివాసంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ గచ్చిబౌలి లోని కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సాయిచంద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో ప్రజలను చైతన్యమంతులను చేయడంలో సాయిచంద్ కృషి చేశారు.

లక్షలాదిమంది పాల్గొన్న బహిరంగ సభలను ప్రజలను ఆకట్టుకునే విధంగా తన గొంతుకను వినిపించి సభలో పాల్గొన్న వారిని అలరించడంలో సాయి చంద్ ది అందవేసిన గొంతుక అని చెప్పవచ్చు.  ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు పాల్గొనే భారీ బహిరంగ సభలు రాష్ట్రంలో ఎక్కడ నిర్వహించినా ఆయన పాల్గొనేవారు.

సాయిచంద్ పార్థివ దేహానికి సిఎం కెసిఆర్ ఘన నివాళులు అర్పించారు. గుర్రంగూడ లోని సాయిచంద్ నివాసానికి కెసిఆర్ చేరుకొని ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్ ను చూడగానే ముఖ్యమంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకొని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…” సార్ సాయిని పిలువండి. లెమనండి..మీరు పిలిస్తే లేచివస్తాడు..సార్..” అంటూ హృదయ విదారకంగా రోదిస్తున్న సాయిచంద్ భార్య రజనీని ఓదార్చడం సిఎంకు కష్టంగా మారింది.