జులై 1 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనం

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీలో మార్టిగేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ విలీనం కానుంది. ఈ రెండు సంస్థల విలీనం కోసం అన్ని అనుమతులు పూర్తి చేసుకోవడంతో జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. జూన్‌ 30న ఇరు సంస్థల బోర్డులు సమావేశమై విలీనానికి ఆమోదం తెలియచేస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ తెలిపారు.

విలీనం తరువాత హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్‌ డీలిస్టింగ్‌ ప్రక్రియ జులై 13 నుంచి ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనానికి గత సంవత్సరం ఏప్రిల్‌4న అంగీకారం కుదిరింది. ఈ రెండు సంస్థల విలీనానికి సెబీ, సీసీఐ, ఆర్బీఐ సహా పలు ఇతర నియంత్రణ సంస్తలు ఆమోదం తెలిపాయి.  కార్పొరేట్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద విలీనం. దీని విలువ 40 బిలియన్‌ డాలర్లు.

విలీనం తరువాత రెండు సంస్థల ఆస్తుల విలువ 18 లక్షల కోట్లకు చేరనుంది. విలీనం తరువాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా ఉంటుంది.  విలీనం తరువాత హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌గా ఇది కొనసాగనుంది. విలీనం తరువాత హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన 60 సంవత్సరాలలోపు ప్రతి ఉద్యోగిని కొనసాగిస్తామని ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ స్పష్టం చేశారు. వీరు ప్రస్తుతం పొందుతున్న వేతనాలను కూడా తగ్గించబోమన్నారు.

విలీనం తరువాత ప్రపంచంలోనే 10వ అతి పెద్ద బ్యాంక్‌గా హెచ్‌డీఎఫ్‌సీ అవతరించనుంది. 25 షేర్లు కలిగి ఉన్న ప్రతి హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన షేర్లు హోల్డర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన 42 షేర్లు లభిస్తాయి. ఈ రెండు సంస్థల విలీనం అమల్లోకి వస్తుందన్న వార్తలతో స్టాక్‌ మార్కెట్లు ఈ రెండు సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి.