జలదిగ్బంధంలో 300 రోడ్లు.. నిలిచిన చార్‌ధామ్ యాత్ర

నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి.. వర్షాలు, వరదల కారణంగా 300కు పైగా రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.
‘కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న 350 సున్నిత ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది’అని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ఆరు మరణాలు సంభవించాయి. కేదార్‌నాథ్‌, బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో ప్రతికూల వాతావరణం కారణంగా చార్‌ధామ్ యాత్ర నిలిచిపోయింది. వేర్వేరు ప్రాంతాల్లో హిమపాతం, వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దాంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
 
వాతావరణ శాఖ అనుమతించిన తర్వాత పర్యాటకులు తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుతున్నామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మీడియాకు వెల్లడించారు.  ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం చార్ ధామ్ యాత్రను నిలిపివేసింది. వారం రోజులుగా కురుస్తున్న మంచు, వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. యాత్రకు వచ్చే ప్రయాణికులు వాతావరణం అనుకూలించిన తర్వాత తమ యాత్రను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని సీఎం ధామి తెలిపారు.
 
రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి, చమోలీ, పితోరాగఢ్‌, రుద్రప్రయాగ, బాగేశ్వర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది..