15న అహ్మదాబాద్ లో భారత్ – పాకిస్తాన్ క్రికెట్

ఐసీసీ పురుషుల ప్రపంచకప్ 2023కు చెందిన షెడ్యూల్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి మంగళవారం విడుదల చేసింది. ముంబైలో ఇవాళ జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 5వ తేదీన టోర్నీ ప్రారంభంకానున్న‌ది.  అహ్మాదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వ‌హిచ‌నున్నారు.
ఫైన‌ల్ మ్యాచ్‌ను కూడా అదే స్టేడియంలో నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌ర్ 15వ తేదీన హై వోల్టేజ్ ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది. ఈ మ్యాచ్‌కు అహ్మాదాబాద్ వేదిక‌గా నిలువ‌నున్న‌ది.  10 వేదిక‌ల్లో 46 రోజుల పాటో మెగా టోర్నీ జ‌ర‌గ‌నున్న‌ది. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌రుగుతుంది. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 8న‌ చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడ‌నున్న‌ది.
 
టోర్నీలో మొత్తం 10 జ‌ట్లు ఉంటాయి. జింబాబ్వేలో జ‌రుగుతున్న క్వాలిఫ‌యిర్ టోర్నీ నుంచి రెండు జ‌ట్లు వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు అర్హ‌త సాధించ‌నున్నాయి. ప్ర‌తి జ‌ట్టు తొమ్మిదిసార్లు రౌండ్ రాబిన్ ప‌ద్ధ‌తిలో మ్యాచ్‌లు ఆడుతాయి. టాప్ నాలుగు జ‌ట్లు సెమీస్‌కు అర్హ‌త సాధిస్తాయి.
 
భారత్ జట్టు ఆడే పూర్తి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ఉంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో, అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్థాన్‌తో ఢిల్లీలో, 15న పాకిస్థాన్‌తో అహ్మదాబాద్‌లో, 19న బంగ్లదేశ్‌తో పుణేలో, 22న న్యూజిలాండ్‌తో ధర్మశాలలో, 29న ఇంగ్లండ్‌తో లక్నోలో, నవంబర్ 2న క్వాలిఫైయర్ జట్టుతో ముంబైలో, 5న సౌతాఫ్రికాతో కోల్‌కతాలో, 11న క్వాలిఫైయర్ జట్టుతో బెంగళూరులో భారత జట్టు తలపడనుంది.
 
ఈ ఆటల  ట్రోఫీ యాత్రను ఐసీసీ సోమవారం ఘనంగా ఆరంభించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ట్రోఫీని ఈ ఏడాది అంతరిక్షంలో లాంచ్ చేయడం విశేషం. భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో ట్రోఫీని ఆవిష్కరించింది. బెలూన్ సాయంతో ట్రోఫీని నింగిలోకి పంపారు.  ఆ తర్వాత ట్రోఫీ నేరుగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దిగింది. ట్రోఫీ లాంచ్ కు సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నేటి నుంచి ట్రోఫీ ప్రపంచ యాత్ర ప్రారంభం అవుతుంది. 100 రోజుల పాటు మొత్తం 18 దేశాల్లో ట్రోఫీ యాత్ర సాగనుంది.
 
భారత్ లో ప్రారంభమయ్యే ఈ ట్రోఫీ టూర్​.. కువైట్, బహ్రెయిన్, మలేషియా, యూఎస్ఏ, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాంజ్​, సౌతాఫ్రికా తదితర దేశాల్లో పర్యటించనుంది. జూన్ 27 నుంచి జులై 14 వరకూ భారత్ లో ట్రోఫీ పర్యటన సాగనుంది. ఆ తర్వాత ఇతర దేశాలకు వెళ్లి.. తిరిగి సెప్టెంబర్ 4న భారత్ కు చేరుకుంటుంది.