ఉత్తరాదిన వడదెబ్బలకు వందమందికి పైగా దుర్మరణం

ఉత్తర భారతంలో వడదెబ్బలకు వంద మందికిపైగా దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ప్రజలు నానా అగచాట్లకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర స్థాయి ఎండలు, వడదెబ్బలతో 72 గంటలలో 54 మంది దుర్మరణం చెందారు. ఉత్తరాదిలో ఇప్పుడు భీకర స్థాయిలో వడగాడ్పులు కల్లోలం సృష్టిస్తున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాలలో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. యుపిలో గత మూడు రోజుల వ్యవధిలో దాదాపు 400 మంది వరకూ ఎండలతో అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రులలో చికిత్సకు వెళ్లాల్సి వచ్చింది. వృద్ధులు, పిల్లలే కాకుండా యువతరం, ఇంటిపట్టున ఉండే వారు కూడా ఎండదెబ్బలతో సొమ్మసిల్లుతున్నారు.

రాబోయే రోజుల్లో పది రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రాగల మూడు రోజులు వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. వేడిగాలుల నేపథ్యంలో బిహార్‌లో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు.

లక్నో, అలహాబాద్ , పలు మారుమూల ప్రాంతాల్లోని ఆసుపత్రులలో ఇప్పుడు రోగుల తాకిడి ఎక్కువ కావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి రికార్డు అవుతున్నాయి. యుపిలోని బాలియాలో అత్యధికంగా వడదెబ్బల ప్రభావం పడింది.

ఈ ఒక్క జిల్లాలోనే వంద మందికిపైగా ఆసుపత్రులలో పడ్డారు. పలువురికి జ్వరాలు, శ్వాసపీల్చుకోలేకపోవడం, ఇబ్బందికరం అవుతోందని జిల్లా వైద్య ప్రధానాధికారి డాక్టర్ జయంత్‌కుమార్ తెలిపారు. అయితే చాలాకాలంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎండవేడిమికి గురవుతే వారి పరిస్థితిదిగజారుతోంది.

బాలియాలో 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. బాలియాలో ఇప్పటి పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యమంత్రి బ్రజేష్ పాథక్ తెలిపారు.

బీహార్‌లో 24 గంటల వ్యవధిలోనే 44 మంది ప్రాణాలు కోల్పోయ్యారు. వీరిలో 35 మంది పాట్నాకు చెందిన వారే. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. దీనితో జనం నీడపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
బిహార్‌లో హీట్‌వేవ్ గత 11 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. అంతకుముందు 2012లో 19 రోజుల పాటు నిరంతరంగా వేడిగాలులు వీచాయి. ఈ సారి 20 రోజులుగా వేడిగాలులు వీస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లో ఎండలతీవ్రతతో పాఠశాలలకు సెలవులను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించారు.  తీవ్ర ఎండల నేపథ్యంలో జార్ఖండ్‌లో జూన్‌ 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గోవా, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని సెలవులను పొడిగించాయి.

విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో చాలా వేడి గాలులు వీస్తాయని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వచ్చే మూడు రోజులు వేడి మరింత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో రానున్న 24 గంటలపాటు వేడిగాలులు వీస్తాయని పేర్కొంది.

కాగా, ఈశాన్య రాజస్థాన్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. సోమ, మంగళవారాల్లో పశ్చిమ మధ్యప్రదేశ్, నైరుతి ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాబోయే రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.