బిపర్‌జోయ్ విధ్వంసం సర్వసన్నద్ధతతో ఎదుర్కొన్నాం

మన దేశ విపత్తు స్పందన సత్తా ఎంతో అభివృద్ధి చెందిందని చెబుతూ బిపర్‌‌జోయ్ తుపాను గుజరాత్‌లోని కచ్‌లో భారీ విధ్వంసం సృష్టించిందని, అయితే ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలతో, సర్వసన్నద్ధతతో దీనిని ఎదుర్కొన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా, భారతీయుల సమష్టి శక్తి, ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు.
 
‘మన్ కీ బాత్’ 102వ రేడియో కార్యక్రమంలో మోదీ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు.  మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమవుతూ ఉండేది. కానీ, ఈ నెల 21 నుంచి ఆయన అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించబోతున్నందువల్ల ఈ కార్యక్రమాన్ని ముందుగానే ప్రసారం చేశారు.
భారత దేశం గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసుకున్న విపత్తు నిర్వహణ సత్తా నేడు గొప్ప దృష్టాంతంగా మారిందని మోదీ చెప్పారు. బిపార్‌జాయ్ తుపాను నుంచి కచ్ ప్రజలు త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు.

వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని ప్రధాని తెలిపారు. ఒక ప్రపంచం-ఒకే కుటుంబంగా అందరి సంక్షేమం కోసం యోగా అని తెలిపారు. యోగా స్ఫూర్తిని ఇది వ్యక్తం చేస్తుందని చెబుతూ ఇది అందరినీ అనుసంధానం చేసి, అందరూ తనను అనుసరించేలా చేస్తుందని పేర్కొన్నారు.

 2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించాలని భారత దేశం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది క్షయ రోగులను దత్తత తీసుకుంటున్నారని తెలిపారు. ఇది భారత దేశ వాస్తవ బలమని చెప్పారు.

మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఛత్రపతి శివాజీ మహారాజు పరిపాలనను పరిశీలించాలని చెప్పారు. ఆయన నుంచి ధైర్యసాహసాలతో పాటు ఆయన పరిపాలన నుంచి నేర్చుకోవలసినది చాలా ఉందని పేర్కొన్నారు. ఆయన మేనేజ్‌మెంట్ స్కిల్స్, మరీ ముఖ్యంగా నీటి యాజమాన్యం, నావికా దళం నైపుణ్యాలు ఇప్పటికీ భారత దేశానికి గర్వకారణమని వివరించారు.

ప్రతి నీటి చుక్కను పొదుపు చేసేందుకు చాలా మంది కృషి చేస్తున్నారని, తమ శక్తిమేరకు కృషి చేస్తున్నట్లు ఎంతోమంది లేఖలు రాశారని ప్రధాని గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బండా జిల్లా వాసి తులసీరామ్ యాదవ్ కూడా లేఖ రాశారాని,  హపూర్ జిల్లాలోని అంతరించిన నదిని ప్రజలు పునరుద్ధరించారని తెలిపారు. ఈ నది మూలాధారాన్ని అమృత్ సరోవర్‌గా తీర్చిదిద్దారని చెప్పారు.

నిస్సారమైన చౌడు భూములను సారవంతంగా, పచ్చదనంతో నిండిపోయేలా చేయాలంటే జపాన్‌లోని మియావాకీ అనే విధానం చాలా బాగుంటుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ టెక్నిక్‌ను క్రమంగా భారత దేశంలో కూడా అనుసరిస్తున్నారని తెలిపారు. కేరళలో టీచర్ రాఫి రామ్‌నాథ్ ఈ విధానాన్ని ఉపయోగించి 115 రకాల మొక్కలతో విద్యావనం పేరుతో ఓ చిన్న అడవిని సృష్టించారని ప్రధాని ప్రశంసించారు. ఈ చిట్కాను ఉపయోగించాలని దేశవాసులందరినీ కోరుతున్నానని చెప్పారు.

మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఛత్రపతి శివాజీ మహారాజు పరిపాలనను పరిశీలించాలని చెప్పారు. ఆయన నుంచి ధైర్యసాహసాలతో పాటు ఆయన పరిపాలన నుంచి నేర్చుకోవలసినది చాలా ఉందని పేర్కొన్నారు. ఆయన మేనేజ్‌మెంట్ స్కిల్స్, మరీ ముఖ్యంగా నీటి యాజమాన్యం, నావికా దళం నైపుణ్యాలు ఇప్పటికీ భారత దేశానికి గర్వకారణమని వివరించారు.

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని చెప్పారు. మన ప్రజాస్వామిక సిద్ధాంతాలు అత్యున్నతమైనవని, మన రాజ్యాంగం సర్వోత్కృష్టమైనదని చెప్పారు. అందువల్ల జూన్ 25ను ఎన్నటికీ మర్చిపోబోమని, మన దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని విధించిన రోజు జూన్ 25 అని గుర్తు చేశారు.