గోవాలో జి20 పర్యాటక మంత్రుల సదస్సు నేటి నుండే

గోవాలో జి20 పర్యాటక మంత్రుల సదస్సు నేటి నుండే

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన గోవా జీ-20 పర్యాటక వర్కింగ్ గ్రూప్ చివరి సమావేశాలతో పాటు జీ-20 పర్యాటక మంత్రుల  కాన్ఫరెన్సుకు సిద్ధమైంది. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న సమావేశాలకు గోవా దేశంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రాంతమని కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి వి. విద్యావతి చెప్పారు.

సుందరమైన బీచ్‌లకు, అద్భుత వారసత్వ సంపదకు, ప్రకృతి సౌందర్యానికి, ఎకో టూరిజంతో పాటు గొప్ప సంస్కృతితో కూడిన అనేక అనుభవాలకు వేదిక గోవా అని, అందుకే పర్యాటక వర్కింగ్ గ్రూప్ చివరి సమావేశాన్ని నిర్వహించేందుకు ఎంపిక చేశామని వెల్లడించారు.

వర్కింగ్ గ్రూప్ ద్వారా విజయవంతమైన చర్చలు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంతో పాటు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని ఆమె తెలిపారు. జీ-20కు ఈ ఏడాది నాయకత్వం వహిస్తున్న భారత్ పర్యాటక విభాగంలో గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, స్కిల్స్, పర్యాటక రంగంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ అనే ఐదు అంశాలను ప్రాధాన్యంగా తీసుకుందని ఆమె వివరించారు.

ఈ ప్రాధాన్యతలు 2030 వరకు నిర్దేశించుకున్న సుస్ధిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి కీలక సాధనాలని ఆమె చెప్పారు. ముగింపు సమావేశంలో జీ-20 సభ్య దేశాలతో పాటు ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఖరారు చేసిన సంస్కరణలను స్వాగతించి ఆమోదిస్తాయని విద్యావతి ఆశాభావం వ్యక్తం చేశారు.

 పర్యాటక వర్కింగ్ గ్రూప్ నిర్దేశించుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఒక వాహనంగా గోవా రోడ్‌మ్యాప్, జీ-20 పర్యాటక మంత్రుల ప్రకటన ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ‘మేకింగ్ క్రూయిజ్ టూరిజం ఎ మోడల్ ఫర్ సస్టైనబుల్ & రెస్పాన్సిబుల్ ట్రావెల్’ అనే థీమ్‌తో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించే వ్యూహాలపై దృష్టి పెట్టినట్టు ఆమె వెల్లడించారు.
 
ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ టూరిజం అభివృద్ధిలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై ఈ కార్యక్రమంలో చర్చిస్తామని చెప్పారు. జూన్ 20న జరిగే ప్రధాన ఈవెంట్‌తో పాటు దేశంలో క్రూయిస్ టూరిజం అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలపై చర్చించేందుకు ‘మేకింగ్ ఇండియా ఏ క్రూయిజ్ టూరిజం హబ్’ అంశంపై దృష్టి సారిస్తూ జాతీయ స్థాయి సైడ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు.
 
జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా గోవా రాష్ట్ర ప్రభుత్వం జీ-20 సమావేశాలతో సమాంతరంగా ప్రత్యేక యోగా సెషన్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు విహారయాత్రలు, సందర్శనలు ఏర్పాటు చేసినట్లు విద్యావతి చెప్పారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్ఇపి)తో పాటు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యుఎన్ డబ్ల్యుటిఒ) సహకారంతో పర్యావరణంపై దృష్టి సారిస్తూ కొన్ని సైడ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అలాగే జూన్ 21న గోవాలో పర్యాటక మంత్రిత్వ శాఖ, వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ సహకారంతో మరికొన్ని సైడ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు.