వచ్చే ఎన్నికల్లో వ్యూహంతోనే ముందుకెళ్తామని చెబుతూ తాను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెడుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తా అని చెబుతూ గతంలో మాదిరిగా రెండు చోట్లా నిలబడటం తనకు ఇష్టం లేదని తెలిపారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బుధవారం తూర్పుగోదావరి జిల్లా నుండి ప్రారంభించిన `వారాహి విజయ యాత్ర’ సందర్భంగా కత్తిపూడిలో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ తాను ఇష్టంతో సినిమాలు చేయడం లేదని, పార్టీని నడపడానికి సినిమాలు చేస్తున్నానని స్పష్టం చేశారు.
గతంలో తనను ఓడించడానికి గట్టి ప్రయత్నం చేశారని చెబుతూ ఈ సారి ఎలా ఆపుతారో చూస్తానని సవాల్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉండడు.. పారిపోతాడనుకున్నారని, కానీ మంగళగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టుకుని పోరాడుతున్నట్లు గుర్తు చేశారు. తాము చేగువేరాను స్పూర్తిగా తీసుకున్నామని చెప్పారు.
“వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెడతాను. దానికోసం ఎన్ని వ్యూహాలైన వేస్తాను. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తాను. చేగువేరా, నేతాజీ, భగత్ సింగ్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను. చేగువేరా పుట్టిన రోజు నాడే వారాహిపై తొలి సభలో ప్రసంగించడం ఆనందంగా ఉంది” అంటూ తన రాజకీయ వ్యూహాన్ని వెల్లడించారు.
పరిపాలించేవాడు నిజాయితీపరుడై ఉండాలని చెబుతూ నాయకులు బాధ్యతగా లేనప్పుడు కచ్చితంగా ప్రశ్నిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దోపిడీ, అవినీతిపరులతోనే తన పోరాటమని చెబుతూ ఏపీలో అవినీతి, అరాచక పాలన సాగిస్తున్నారని వైపీపీపై మండిపడ్డారు. ప్రజలను దోపిడీ చేస్తూ తనను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
151 సీట్లున్న వైఎస్సార్సీపీ మనల్ని టార్గెట్ చేస్తుందంటే జనసేన ఎంత బలమైందో అర్థమవుతోందని చెప్పారు. “మన దగ్గర అన్యాక్రాంతంగా వచ్చిన ఆస్తులు లేవు. మనమేదైనా మాట్లాడటానికి అధికారంలో లేం. నువ్వు విడిగా రా.. అని అంటారు. ఒంటరిగా వస్తానో.. కలిసే వస్తానో ఇంకా నిర్ణయం తీసుకోలేదు” అని తెలిపారు. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
ముందస్తు ఎన్నికలు రావని ముఖ్యమంత్రి జగన్ కథలు చెబుతున్నారని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్లో నవంబర్లోనో, డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. మన వనరులు దోచుకుని, మన రోడ్లు నాశనం చేసి, మన పర్యావరణాన్ని బీభత్సం చేసి.. సంక్షేమ పథకాలు అని చెప్పి 5 రూపాయలో, పది రూపాయలో పడేస్తున్నారని పవన్ కల్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఢిల్లీ వెళ్లినప్పుడు గజేంద్రసింగ్ షెకావత్తో పోలవరం గురించి మాట్లాడానని చెబుతూ పోలవరం అనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏటీఎం మెషిన్లా తయారైందని ఆరోపించారు. ఎన్ని చట్టాలు తెచ్చినా చిత్తశుద్ది లేని నాయకులున్నప్పుడు ఏ పనీ అవదని చెప్పారు. “నేను నిజాయితీగా నిలబడే వ్యక్తిని. మమ్మల్ని నమ్మండి. మమ్మల్ని గుర్తించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని విజ్ఞప్తి చేశారు.
More Stories
వడ్డీ రేట్లను భారీగా పెంచిన స్టేట్ బ్యాంకు
చాబహార్ పోర్టుపై చిన్న చూపు తగదు .. అమెరికాకు హితవు
జూన్ 1 వరకు సీఎం జగన్ విదేశీ పర్యటన