నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే ఉపాధి కల్పనకు కేంద్రం బాటలు

కేంద్ర ప్రభుత్వం ఒక వైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన రోజ్‌గార్‌మేళాలో పాల్గొన్నారు. 9 జాతీయ బ్యాంక్‌లు, డీఆర్‌డీవో, ఇండియన్ రైల్వే, డిఫెన్స్, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సహా మొత్తం 22 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 470 మందికి కేంద్ర మంత్రి నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ మంత్రివర్గం సమావేశంలో అన్ని శాఖల ఖాళీలను గుర్తించాలని కోరగా దాదాపు 10 లక్షల పోస్టులు ఉన్నట్టుగా గుర్తించినట్లు తెలిపారు. 10 లక్షల ఖాళీలను ఏకకాలంలో రిక్రూట్‌చేయడం సాధ్యం కాదని, నెలకు 70 వేల చొప్పున భర్తీ చేస్తున్నారని చెప్పారు.

ఈమేరకు రోజ్‌గార్ మేళా నిర్వహిస్తూ స్వయంగా ప్రధాని ఉద్యోగార్థులతో మాట్లాడుతున్నారని తెలిపారు. 22 అక్టోబర్ 2022 దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్ గార్ మేళా’ను ప్రధానమంత్రి ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్వహించే 6వ రోజ్‌గార్ మేళా కాగా నేటితో కలుపుకుని 4 లక్షల 30 వేలకు పైగా మంది యువకులకు అపాయింట్‌మెంట్ పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారని తెలిపారు.  స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని.. వారు ఉపాధి కోసం వెతికే స్థితి నుంచి ఉపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని వివరించారు.

2047 నాటికి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు పూర్తవుతుంది. అప్పటి వరకు మన యువత తమ శక్తి యుక్తులను ఉపయోగించి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగ్రామిగా నిలబెట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. భారత్ నేడు ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంతో దేశంలో మొత్తం వాణిజ్య ఎగుమతులు 2021—22లో 418 బిలియన్ డాలర్లు వచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు.