తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పన్నులు, సుంకాల వాటాల నిధులు విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఏపీ, తెలంగాణకు రాష్ట్రాల వాటా కింద నిధులు విడుదల చేసింది. జూన్ నెలకు గానూ మూడో విడత కింద రాష్ట్రాలకు మొత్తం రూ.1,18,280 కోట్ల నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు పన్నుల వాటా కింద రూ.4,787 కోట్లు, తెలంగాణ వాటా కింద రూ.2,486 కోట్లు విడుదల చేసింది. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం వాటాను తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది. రాష్ట్రాల వాటాలను ఒక ఆర్థిక సంవత్సరంలో 14 విడతల్లో కేంద్రం విడుదల చేస్తుంది.
జూన్ నెలలో చెల్లించాల్సిన దానితో పాటు ఒక విడత అడ్వాన్స్ నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నిధులను మూలధన వ్యయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అదేవిధంగా ప్రధాన ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులు అందించే ఉద్దేశంతో ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఇటీవల ఏపీకి కేంద్రం భారీగా నిధులు విడుదల చేసింది. లోటు బడ్జెట్ కింద 10,400 కోట్లు విడుదల చేయగా, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం రూ.12,911 కోట్లను యుద్ధ ప్రాతిపదికన కేటాయించింది. దాంతో రాష్ట్రానికి జీవనాడిగా భావించే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు ఊపందుకున్నాయి.
More Stories
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం