మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్

ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాగుంట రాఘవరెడ్డికు ఢిల్లీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. గాయపడి ఆస్పత్రిలో చేరిన తన అమ్మమ్మను చూసేందుకు వీలు కల్పిస్తూ బెయిల్ ఇవ్వాలన్న మాగుంట రాఘవ రెడ్డి అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు మన్నించింది. రెండు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదే కేసులో తెలుగు రాష్ట్రాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త, అరబిందో గ్రూప్ డైరక్టర్ శరత్‌చంద్ర రెడ్డి అప్రూవర్‌గా మారడం కూడా రాఘవ రెడ్డి బెయిల్ పొందడానికి ఉపయోగపడిందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.  మద్యం పాలసీ అక్రమాల్లో మనీ లాండరింగ్ అంశాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) మాగుంట రాఘవను ఈ ఏడాది ఫిబ్రవరి 10న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన రాఘవ ఢిల్లీలో పలు రిటైల్ జోన్లను చేజిక్కించుకుని మద్యం వ్యాపారం చేశారు. అయితే మద్యం పాలసీ రూపొందించ ముందు నుంచే ఢిల్లీ ప్రభుత్వ పెద్దలతో కలిసి మంతనాలు సాగించారని, తమకు అనుకూలంగా పాలసీ నిబంధనలు ఉండేలా చేసి అందుకు రూ. 100 కోట్లు సౌత్ గ్రూప్ తరఫున అడ్వాన్సుగా ముడుపులు చెల్లించారని దర్యాప్తు సంస్థలు ఆరోపించారు.

కోర్టులో వాదోపవాదనల సందర్భంగా మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ 83 ఏళ్ల రాఘవ అమ్మమ్మ బాత్రూమ్‌లో జారపడడంతో ముక్కుకు గాయమైందని, అయితే ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పారని వివరించారు.  ఆమె బాగోగులు చూసుకునే బంధువులు చాలామందే ఉన్నారని, పైగా ఐసీయూలో ఉండగా రోగిని చూడడం కుదరదని వాదించిన ఆయన వాదించారు.

మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయడం సరికాదని గుర్తుచేశారు.  ఇరువైపుల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం కొన్ని షరతులతో రాఘవ తన అమ్మమ్మను చూసేందుకు అనుమతి కల్పించింది. ఈ క్రమంలో రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.