ఏపీలో ముందస్తు ఎన్నికలకు వీడుతున్నట్లు ఈ మధ్య జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగింపు పలికారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో మాట్లాడుతూ సీఎం జగన్ ఈ విషయమై ఊహాగానాలకు తెరదించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని ఆయన తేల్చి చెప్పేశారు.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పేర్కొంటూ ఇంకో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని మంత్రులకు స్పష్టత ఇచ్చారు. ఈ 9 నెలలు బాగా కష్టపడాలని మంత్రులకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఇప్పుడు కష్టపడితే మళ్లీ గెలుపు మనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు
కాగా, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమై 12వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లును తీసుకొచ్చారు.
ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, గ్రూప్-1, 2 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 63 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు.
జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28వ తేదీన అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 8.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ. 445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్ కు కేటాయించారు.
రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలలకు 706 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్తూరు డైరీ ప్లాంటుకు చెందిన 28 ఎకరాల భూమినీ లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణ సేకరణకు నిర్ణయించారు. జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహణకు నిర్ణయించారు. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు ఆమోదం తెలిపారు.
కేబినెట్ నిర్ణయాలు
* ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం
* ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్ ఆమోదం
* కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం
* 2024 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు వర్తింపు
* గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం
More Stories
ధర్మవరంలో బిజెపి కార్యకర్తలలపై రెచ్చిపోయిన వైసీపీ మూకలు
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
ఏపీలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్ బలగాలు