టీటీడీ ఆధ్వర్యంలో నవీ ముంబాయిలో నిర్మిస్తున్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేందర్ పడ్నవిస్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సుమారు 10 ఎకరాల్లో నిర్మిస్తున్న ఆలయానికి రేమాండ్ గ్రూప్ సీఎండీ గౌతం హరి సింఘానియా 60 నుంచి 75 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ ముంబాయి వాసుల సుదీర్ఘ కాల నెరవేరనుందని పేర్కొన్నారు. తిరుపతికి వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లలేని భక్తులకు నవీ ముంబాయిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం ఎంతగానో ఉపయోగ పడుతుందని వెల్లడించారు. ఆలయం నిర్మాణంలో తమ వంతు పూర్తి సహకారం అందజేస్తామని ఆయన తెలిపారు.
‘ఇంకో విషయం ఏమిటంటే, త్వరలో రాబోతున్న ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్లోని 22 కిలోమీటర్ల పొడవైన సింగిల్ బ్రిడ్జ్ మహాలక్ష్మి ఆలయానికి అనుసంధానించబడుతోంది. ఈ పనులన్నీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో జరుగుతున్నాయి. నవీ ముంబైలోని బాలాజీ ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం తరపున మేము మా పూర్తి సహకారాన్ని అందిస్తాము’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో ఉన్నమాదిరిగా నవీ ముంబాయిలో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. పుష్కరిణీ, అలంకార మండపం, రథ మండపం, వాహన మండపం, మాఢ వీధులను నిర్మించి రెండు సంవత్సరాల్లో ఆలయాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మిలింద్ నర్వేకర్, అమోల్ కాలే, రాజేశ్ శర్మ, సౌరభ్ బోరా తదితరులు పాల్గొన్నారు.
More Stories
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ ఏర్పాటు
చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్రం
పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు